1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2020 (11:00 IST)

సూట్‌కేసులో బతికిన శవం : ఫ్రెండ్‌ని ఇంటికి తీసుకొచ్చేందుకు ఓ మిత్రుడి ఐడియా

దేశవ్యాప్తంగా కరోనా ఆంక్షలు చాలా కఠినంగా ఉన్నాయి. ఒక ప్రాంతం వారిని మరో ప్రాంతంలోకి అనుమతించడంలేదు. ఇంతెందుకు.. పక్కింటి వారిని కూడా ఇంట్లోకి రానివ్వడం లేదు. నగరాలు, పట్టణాల్లో నివశించే అపార్టుమెంట్ వాసుల పరిస్థితి ఇలానేవుంది. తమ అపార్టుమెంట్ ప్రాంగణంలో ప్లాట్లలో ఇతరులను అనుమతించడం లేదు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇలాంటి ఆంక్షలు విధించక తప్పనిస్థితి నెలకొంది. అయితే, ఈ ఆంక్షలు ఒక్కోసారి హాస్యభరిత సన్నివేశాలకు కూడా దారితీసున్నాయి. 
 
తాజాగా కర్నాటక రాష్ట్రంలోని మంగుళూరులో ఆదివారం ఇటువంటి హాస్యభరిత ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న ఓ అపార్టమెంట్‌లోకి ఫ్లాట్ల యజమానులందరూ కలిసి బయటవారిని లోనికి అనుమతిచ్చేది లేదని తీర్మానం చేశారు. కానీ, అదే అపార్ట్‌మెంటులో నివసించే ఓ టీనేజర్‌కు మాత్రం ఏమాత్రం నచ్చలేదు. లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉండలేక పోయాడు. దీంతో ఎలాగైనా తన మిత్రుడిని ఇంట్లోకి తీసుకురావాలని భావించాడు. ఈ విషయం తెలిసిన మిగిలిన ప్లాట్ యజమానులు అందుకు అంగీకరించలేదు. దీంతో ఎలాగైనా తన మిత్రుడిని ఇంట్లోకి తీసుకురావాలన్న నిర్ణయానికి వచ్చాడు. 
 
ఇందులోభాగంగా, తనకు వచ్చిన ఓ ఐడియాను ఆచరణలో పెట్టాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఓ పెద్ద సూట్‌కేసులో తన స్నేహితుడిని దాచి.. తన ఫ్లాట్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే సూట్‌కేసు లాగేందుకు అతడు పడుతున్న అవస్థ, ఆ సూట్‌కేసు‌ కదలికలు ఇతరులకు అనుమానం కలిగించాయి. 
 
దీంతో అతడి చేత బలవంతంగా దాన్ని తెరిపిరంచగా అసలు విషయం బయటపడింది. దీంతో వెంటనే ఇతర ఫ్లాట్ల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆ ఇద్దరు టీనేజర్లను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. వారి వారి తల్లిదండ్రులను కూడా స్టేషన్‌కు పిలిపించినట్టు తెలిసింది. అయితే పోలీసులు ఎటువంటి కేసులూ నమోదు చేయలేదని సమాచారం.