గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 10 మే 2019 (12:52 IST)

సమయం కోరిన మధ్యవర్తులు.. అయోధ్య కేసు మళ్లీ వాయిదా!

వివాదాస్పద రామజన్మభూమి స్థల కేసు విచారణ మరోమారు వాయిదా పడింది. ఈ స్థల పరిష్కారం కోసం సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ మరికొంత సమయం కోరడంతో ఈ కేసు తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 15వ తేదీకి వాయిదా వేసింది. 
 
అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి ఫకీర్ మహ్మద్ ఇబ్రహీం కలీఫుల్లా నేతృత్వంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీశీ రవిశంకర్‌, సీనియర్ లాయర్ శ్రీరాం పంచు సభ్యలుగా సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఈ కమిటీ 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని అపెక్స్ కోర్టు ఆదేశించింది. ఈ కమిటికీ అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరింది. 
 
రామజన్మభూమి - బాబ్రీమసీదు స్ధలంలో వివాదాస్పదమైన 2.77 ఎకరాలను నిర్మోహి అఖారా, సున్ని సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు (యూపీ), రామ్‌లల్లా విరాజ్‌మన్‌ల మధ్య పంచాలని అలహాబాద్‌ హైకోర్టు 2010లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. 
 
ఈ పిటిషన్లతో  పాటు అయోధ్యలో సేకరించిన వివాదాస్పదం కాని 67.703 ఎకరాల మిగులు భూమిని వాటి యజమానులకు తిరిగి అప్పగించేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణకు చేపట్టింది.
 
అపుడుమధ్యవర్తుల కమిటీ తరపున హాజరైన న్యాయవాది నివేదిక ఇచ్చేందుకు మరికొంత సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ నేతృత్వంలోని బెంచ్‌ వాయిదా వేసింది. పూర్తి నివేదిక ఇచ్చేందుకు మరికొంత గడువు ఇవ్వాలని కమిటీ కోరిందని, ఈ క్రమంలోనే తదుపరి విచారణను ఆగస్టు 15వ తేదీన చేపడుతామని కోర్టు స్పష్టం చేసింది.