శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 19 ఆగస్టు 2014 (13:42 IST)

బీహార్‌లో ఆటో యాక్సిడెంట్: 20 మంది మృతి, మోడీ సంతాపం

బీహార్‌లో జరిగిన ఆటో యాక్సిడెంట్ పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవల మెదక్ జిల్లా మాసాయిపేటలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తరహాలోనే రైలు - ఆటోరిక్షా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది మృత్యువాత పడ్డారు. 
 
రాప్తి గంగా ఎక్స్‌ప్రెస్ రైలు ఆటో రిక్షాను ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన 20 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో ఎనిమిది మంది చిన్నారులు, ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
తూర్పు చంపారన్ జిల్లాలోని సెమ్రా, సుగౌలి రైల్వే స్టేషన్ల మధ్య ఆటోరిక్షా రైల్వే గేట్‌ను దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చనిపోయిన వారంతా చినౌతా గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. తమ కులదైవ ఆలయంలో పూజలు నిర్వహించి తిరిగి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. గేట్‌మెన్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. .
 
ఈ ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ జరపనుంది. ఆటోని ఢీకొన్న రైలు సుమారు 50 మీటర్ల దూరం వరకూ ఈడ్చుకుపోయింది. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా తయారయ్యాయి. బీహార్ రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంతాపం తెలిపారు.
 
రైలు ప్రమాద ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ. 1.5 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. రైల్వే శాఖ మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. లక్ష పరిహారంగా ప్రకటించింది.
 
అలాగే, ఈ ప్రమాదానికి బాధ్యులుగా భావించి, అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సెమ్రా సూపరింటెండెంట్, లెవల్ క్రాసింగ్ వద్ద ఉన్న గేట్‌మెన్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌లను సస్పెండ్ చేశారు.