శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 23 నవంబరు 2019 (14:11 IST)

ఇద్దరికి ఒకే ఖాతా నంబరు.. ఒకరు వేస్తే మరొకరు ఖాళీ : మోడీ వేశారనీ వాడేశానంటూ ఆన్సర్

ప్రభుత్వ రంగ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంకు అధికారులు చేసిన పని వల్ల ఓ ఖాతాదారుడు మోసపోతే.. మరో ఖాతాదారుడు మాత్రం తెగ సంబరపడిపోయాడు. ఖాతాలో ప్రతి నెలా నెలా వచ్చిపడుతుంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వేస్తున్నట్టు భావించాడు. ఆ డబ్బుతో తన అవసరాలను తీర్చుకున్నాడు. ఆ సొమ్ముతో జల్సాలు కూడా చేశాడు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని బ్యాంకు అధికారులతో పాటు ఇద్దరు ఖాతాదారులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ జిల్లా బింద్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భింద్ జిల్లాలో రురై గ్రామానికి చెందిన హుకుమ్‌సింగ్, రోనీ గ్రామానికి చెందిన హుకుమ్‌సింగ్‌లు ఇద్దరూ భారతీయ స్టేట్‌ బ్యాంకుకు చెందిన ఒకే శాఖలో ఖాతా తెరిచారు. ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో బ్యాంకు అధికారులు పొరపాటున ఇద్దరికీ ఒకటే ఖాతా నంబరు కేటాయించారు. 
 
ఈ క్రమంలో ఓ గ్రామానికి చెందిన హుకుమ్‌ సింగ్ బ్యాంకులో దాచుకుంటున్న డబ్బులు మరో హుకుమ్‌ సింగ్ ఖాతాలో జమ అవుతున్నాయి. తన ఖాతాలోకి వస్తున్న డబ్బును చూసిన హుకుమ్ సింగ్.. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారని సంబరపడ్డాడు. ఎప్పటికప్పుడు ఆ డబ్బులు తీసుకుని తన అవసరాలకు ఉపయోగించుకున్నాడు. 
 
అలా ఆరు నెలల కాలంలో మొత్తం 89 వేల రూపాయల మేరకు డ్రా చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవల డబ్బులు అవసరమైన అసలు హుకుమ్‌సింగ్ డబ్బులు డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లగా, అందులో రూ.35 వేలు మాత్రమే ఉండడంతో లబోదిబోమంటూ అధికారులను ఆశ్రయించాడు. అప్పటికిగానీ చేసిన పొరపాటును అధికారులు గుర్తించలేకపోయారు.
 
తప్పును గుర్తించిన అధికారులు డబ్బులు వాడుకున్న హుకుమ్‌సింగ్‌ను పిలిచి అసలు విషయం చెప్పి డబ్బుల కోసం ప్రశ్నించారు. దీంతో తనకేమీ తెలియదంటూ సమాధానమిచ్చారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తానని మోడీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశాడు. 
 
అందులో భాగంగానే తన ఖాతాలో డబ్బులు పడుతున్నాయని భావించి వాటిని వాడేసుకున్నానని చెప్పడంతో అధికారులు తెల్లమొహంపెట్టారు. పైగా, అతడి అమాయకత్వాన్ని చూసి ఏం చేయాలో పాలుపోని అధికారులు తలలు పట్టుకున్నారు.