1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 మే 2023 (09:22 IST)

అభివృద్ధి పనులకు అడ్డంకిగా ఉందనీ.. తండ్రి సమాధినే తొలగించిన సీఎం...

naveen patnaik
ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. దేశంలోనే అత్యుత్తమ పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రిగా పేరుగడించారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నారు. అభివృద్ధి ఆయన అజెండా... నినాదం కూడా. అభివృద్ధి చేసే విషయంలో ఎవరినీ లెక్కలోకి తీసుకోరు. తాజాగా, ఆయనకు సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో పూరీలోని శ్మశానవాటికలో చేపట్టిన అభివృద్ధి పనులకు అడ్డంగా ఉందన్న ఉద్దేశంతో ఆయన తన తండ్రి సమాధినే అక్కడి నుంచి తొలగించారట. ఈ విషయాన్ని ఆయన ప్రైవేట్ సెక్రటరీ వీకే పాండ్యన్ తాజాగా వెల్లడించారు. 
 
దుబాయ్‌లో తాజాగా నిర్వహించిన ఒడిశా దివస్ వేడుకల్లో ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్న పాండ్యన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజలకు మేలు చేసే విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా సీఎం వెనుకాడరని అన్నారు. పూరీ మహాప్రస్థానం ఆధునికీకరణ పనులకు అడ్డంగా ఉన్న తండ్రి సమాధిని తొలగించాలని అధికారులను సీఎం ఆదేశించారని ఈ సందర్భంగా పాండ్యన్ గుర్తు చేసుకున్నారు.
 
2019లో పూరీలోని 'స్వర్గద్వార్'లో మరింత స్థలం అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా తన తండ్రి బిజు పట్నాయక్ సమాధిని కూడా తొలగించాలని నవీన్ పట్నాయక్ అధికారులను ఆదేశించారు. బిజూ పట్నాయక్ మృతి తర్వాత 17 ఏప్రిల్ 1997లో స్వర్గద్వార్‌లో భారీ సమాధిని నిర్మించారు. అయితే, దీని వల్ల అక్కడున్న స్థలం తగ్గిపోయి ఇబ్బందులు తలెత్తుతుండడంతో దానిని తొలగించాలని సీఎం స్వయంగా ఆదేశించినట్టు పాండ్యన్ గుర్తు చేశారు.