శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 4 మే 2016 (09:31 IST)

ఎన్డీయే ద్వివార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించండి : బీజేపీ ఎంపీలకు మోడీ సూచన

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అధికారాన్ని చేపట్టి ఈనెల 26వ తేదీతో రెండేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ ద్వితీయ వార్షికోత్సవాలను దేశవ్యాప్తంగా బ్రహ్మాండంగా నిర్వహించాలని బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తమ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని కోరారు. 
 
ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని ఎంపీలకు సూచించారు. ముద్ర పథకం, అందరికీ ఎల్పీజీలు, గ్రామీణ ప్రాంతాలకూ విద్యుత్తు తదితరాలు ఎన్డీయే ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన విజయాలేనని ఆయన గుర్తు చేశారు. వాటికి ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. ఇచ్చిన హామీలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వాటిని వరుసగా నెరవేరుస్తోందన్నారు. 
 
గత రెండేళ్లలో పాలనాపరంగా ఎన్నో విజయాలను సాధించాం. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాత్రం విజయం సాధించలేకపోతున్నట్టు ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఎంతమంది ఎంపీలు రోజూ ప్రజలను కలుస్తున్నారని ప్రశ్నించారు. ఎన్డీయే ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా అని నిలదీశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో బీజేపీ ఎంపీల చొరవపై ఆరా తీశారు.