గండం తప్పింది... బలహీనపడిన నీలోఫర్.. వాతావరణ శాఖ వెల్లడి
అరేబియా సముద్రంలో ఏర్పడిన నిలోఫర్ వాయుగుండం బలహీనపడిందని, ఇది అల్పపీడనంగా మారి తీరం దాటొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముంబైకి నైరుతి దిశలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం గత ఆరు గంటలల్లో సముద్రంలోకి వేగంగా కదిలినందున తుఫాను బలహీనపడింది.
అతి తీవ్ర తుఫాను నుంచి తీవ్ర తుఫానుగా మారిపోయింది. ఇది ఈ రోజు సాయంత్రం గుజరాత్ లోని నాలియా, ఇతర కచ్ తీర ప్రాంతాలను తక్కువ తీవ్రతతో తాకొచ్చు. దీన్ని తుఫానుగా కాకుండా అల్పపీడనంగా భావించొచ్చు అని వాతావరణ విభాగ అధికారి అజయ్ కుమార్ వెల్లడించారు.
ప్రస్తుతం నాలియాకు పశ్చిమ - నైరుతిలో 620 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది వేగంగా బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని అజయ్ కుమార్ పేర్కొన్నారు.