శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 27 జులై 2017 (11:40 IST)

బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ... డిప్యూటీ సీఎంగా మోడీ

బీహార్ రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితీశ్ కుమార్.. తిరిగి కొన్ని గంటల్లోనే ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు.

బీహార్ రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితీశ్ కుమార్.. తిరిగి కొన్ని గంటల్లోనే ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అలాగే, ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ నియమితులయ్యారు. నిన్నటివరకు మహాకూటమి తరపున సీఎంగా ఉన్న నితీశ్ కుమార్.. గురువారం ఎన్డీయే కూటమి తరపున సీఎంగా ప్రమాణం చేయడం గమనార్హం. 
 
బీహార్ ఉపముఖ్యమంత్రిగా ఉన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ అవినీతి ఆరోపణల్లో చిక్కున్నారు. దీంతో డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని సీఎం హోదాలో నితీశ్ ఆదేశించారు. కానీ, తేజస్వీ పెడచెవిన పెట్టడంతో నితీశ్ కుమారే ఏకంగా సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో మంత్రివర్గం రద్దు అయింది. అలాగే, మహాకూటమితో తెగదెంపులు చేసుకుని బీజేపీతో చేతులు కలిపారు. 
 
దీంతో తిరిగి ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా నితీశ్ తిరిగి ఎన్నికయ్యారు. ఫలితంగా నేడు (గురువారం) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన చేత గవర్నర్‌తో ప్రమాణం చేయించారు. కాగా, నితీశ్ రాజీనామా చేసిన 24 గంటల్లోపే తిరిగి సీఎం పీఠాన్ని అధిష్టించనున్నారు. బీజేపీ సహకారంతో ఆయన గద్దెనెక్కనున్నారు. 
 
సీఎం పదవికి రాజీనామా సమర్పించిన అనంతరం బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీతో కలిసి బుధవారం రాత్రి పొద్దుపోయాక గవర్నర్ కేశరినాథ్ త్రిపాఠీని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక బీజేపీ సహకారంతో ఏర్పడనున్న నితీశ్ సర్కారులో సుశీల్ కుమార్ మోడీకి ఉపముఖ్యమంత్రి పగ్గాలు లభించాయి.