మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 జూన్ 2020 (12:29 IST)

వేతనాలు చెల్లించని ప్రైవేటు సంస్థలపై చర్యలొద్దు : సుప్రీంకోర్టు

లాక్డౌన్ సమయంలో వేతనాలు చెల్లించని సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదేసమయంలో లాక్డౌన్​ కాలంలో ప్రైవేటు ఉద్యోగులకు వేతనాల సమస్యను రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని సలహా ఇచ్చింది. 
 
లాక్డౌన్​ కాలంలో ప్రైవేటు ఉద్యోగులకు పూర్తి వేతనం చెల్లించాలన్న కేంద్రం ఆదేశాలను సవాల్​ చేస్తూ.. పలు కంపెనీలు పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్​ అశోక్​ భూషణ్​, జస్టిస్​ సంజయ్​ కిషన్​ కౌల్​, జస్టిస్​ ఎంఆర్​ షాలతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ జరిపి శుక్రవారం తీర్పునిచ్చింది. 
 
ఈ సందర్భంగా ధర్మాసనం కొన్ని సూచనలు చేసింది. పూర్తి వేతనాలు చెల్లించని కంపెనీలపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని సూచన చేసింది. యాజమాన్యాలు, ఉద్యోగుల మధ్య సయోధ్య కుదుర్చాలని రాష్ట్రాలను కోరింది. మార్చి 29న ఇచ్చిన ఆదేశాల చట్ట బద్ధతపై నాలుగు వారాల్లో అఫిడవిట్​ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
 
లాక్డౌన్​ సమయంలో ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించలేని ప్రైవేటు సంస్థలపై జులై చివరి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. వేతనాల సమస్యపై యాజమాన్యాలు, ఉద్యోగులు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరింది. దానికి సంబంధించిన పూర్తి నివేదికను లేబర్​ కమిషనర్లకు సమర్పించాలని స్పష్టం చేసింది.