శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 జులై 2020 (09:07 IST)

కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసి పెళ్ళి ఊరేగింపు... వరుడిని జైల్లో పెట్టిన పోలీసులు

కోవిడ్ నిబంధనలను పట్టించుకోకుండా పెళ్లి ఊరేగింపు నిర్వహించిన వరుడుతో పాటు.. మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో ఈ నెల 2వ తేదీన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గంజాం జిల్లాకు చెందిన ఓ యువకుడు ఈ నెల 2వ తేదీన తన వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో అతిథులను కూడా ఆహ్వానించాడు. ఇందులో పాల్గొన్న వారు ఒక్కరు కూడా మాస్కు ధరించలేదు సరికదా, భౌతిక దూరాన్ని గాలికి వదిలేసి డ్యాన్సులతో హోరెత్తించారు. ఆ తర్వాత వారందరితో కలిసి పెళ్లి ఊరేగింపు నిర్వహించాడు. ఇలా చేయడం కోవిడ్ నిబంధనలకు విరుద్ధం. 
 
ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఇది కాస్తా అధికారుల దృష్టికి చేరడంతో తీవ్రంగా పరిగణించిన అధికారులు వివాహం జరిగిన 'హోటల్ మై ఫెయిర్'ను సీజ్ చేయడంతోపాటు వరుడు, అతడి తండ్రి, ముగ్గురు మామయ్యలను అరెస్టు చేశారు. అలాగే, పెళ్లి ఊరేగింపులో పాల్గొన్న రెండు వాహనాలను సీజ్ చేసినట్టు గంజాం ఎస్పీ పినాక్ మిశ్రా తెలిపారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వివరించారు.