1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (11:55 IST)

ఈ-సిగిరెట్లు ప్రమాదకరం అంటూ ప్రధానికి లేఖ రాసిన వైద్యులు

ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసిందే. పొగాకు కూడా ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుందని డాక్టర్లు అనేక సందర్భాల్లో తెలిపారు. అలాంటి తరుణంలో వీటికి బదులు ఈ-సిగిరెట్లు వచ్చాయి. చూడడానికి స్టైలిష్‌గా ఉంటాయి. తాగికే కిక్కు ఉంటుంది. వీటిలో పొగాకు ఉండదు కదా? మరి ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదులే అని ఎలక్ట్రానిక్ సిగిరెట్లకు అలవాటు పడ్డారా? అయితే వీటి వల్ల చాలా ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు. ఈ మేరకు 27 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన వెయ్యి మందికి పైగా డాక్టర్లు ప్రధాని మోడీకి లేఖను రాశారు.
 
ఎలక్ట్రానిక్ నికోటిన్‌ డెలివరీ సిస్టం (ఈఎన్‌డీఎస్)తో కూడిన ఈ-సిగరెట్లు, ఈ-హుక్కాలతోపాటు విరివిగా దొరుకుతున్న వేప్‌, వేప్‌ పెన్‌లాంటి వస్తువులు ఆరోగ్యానికి ప్రమాదకరం అని వైద్యులు చెబుతున్నారు. ఈ-సిగరెట్లను నిషేధించాలని గతేడాది కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసినప్పటికీ అన్ని రాష్ట్రాల్లో పూర్తిగా అమలు కావట్లేదని, విరివిగా ఈ-సిగిరెట్లు మార్కెట్లో లభిస్తున్నాయని వైద్యులు తమ లేఖలో పేర్కొన్నారు.
 
దేశంలోనూ, రాష్ట్రంలోనూ యువతీయువకులు అందులో ముఖ్యంగా టీనేజర్లు ఈ-సిగిరెట్లకు ఎక్కువ అలవాటుపడుతున్నారు. సాధారణ సిగరెట్టు మాదిరిగా ఇది పొగ బయటకు వదలదు. అందువల్ల ఈ-సిగిరెట్లు తాగేవాళ్లను గుర్తించడం కష్టం. అయితే సాధారణ సిగరెట్లతో ఎంతటి ప్రభావం ఆరోగ్యంపై ఉంటుందో, అంతకుమించి ఈ-సిగరెట్లతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రపంచంలో ఇప్పటికే 36దేశాలు ఈ-సిగరెట్లను బ్యాన్ చేశాయి. ఈ-సిగరెట్లు తయారు చేసే ప్రధాన బ్రాండ్లు అన్నీ కూడా పొగాకు కంపెనీలే. కాగా గత మార్చిలో కూడా ప్రధానికి డాక్టర్లు ఇదే విషయమై లేఖను రాశారు.