గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 21 జూన్ 2018 (10:24 IST)

ప్రయాణికులకు చుక్కలు చూపిన మాయదారి ఎయిర్ ఏషియా...

ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటి ఎయిర్ ఏషియా. దేశంలో చౌక ధరకు విమాన ప్రయాణం కల్పిస్తున్న సంస్థ. అయితే, ఈ సంస్థకు చెందిన పైలట్ ప్రయాణికులకు చుక్కలు చూపించాడు. విమానం నుంచి ప్రయాణికులను దించేందుకు విమాన

ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటి ఎయిర్ ఏషియా. దేశంలో చౌక ధరకు విమాన ప్రయాణం కల్పిస్తున్న సంస్థ. అయితే, ఈ సంస్థకు చెందిన పైలట్ ప్రయాణికులకు చుక్కలు చూపించాడు. విమానం నుంచి ప్రయాణికులను దించేందుకు విమానంలో ఏసీని విపరీతంగా పెంచేశాడు. దీంతో ప్రయాణికులంతా తీవ్రమైన చలితో పాటు వాంతులు చేసుకున్నారు. చిన్నపిల్లలు అయితే శ్వాస ఆడక పూర్తి ఇబ్బందిపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
కోల్‌కతా నుంచి వడోదరాకు బయలుదేరాల్సిన విమానానికి టేకాఫ్‌కు అనుమతి లభించలేదు. ఈ విమానం ఉదయం 9 గంటలకే బయలుదేరాల్సి ఉండగా, తొలుత 30 నిమిషాల పాటు విమానం ఆలస్యమవుతుందని పైలట్ ప్రకటించాడు. ఆపై ఒంటిగంట వరకూ విమానం కదల్లేదు. ఈ సమయంలో విమాన సిబ్బంది ప్రయాణికులకు మంచినీరు కూడా ఇవ్వలేదు. ఆపై ఎలాంటి వివరణ ఇవ్వకుండా ప్రయాణికులంతా దిగిపోవాలని పైలట్ ఆదేశించాడు. 
 
అయితే, బయట భారీ వర్షం కురుస్తూ ఉండటంతో ప్రయాణికులు విమానం దిగేందుకు ఆసక్తిని చూపలేదు. దీంతో ఆగ్రహానికి గురైన పైలట్ విమానంలో ఏసీని విపరీతంగా పెంచేశాడు. దీంతో ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురికాగా, కొందరికి వాంతులయ్యాయి. పిల్లలకు శ్వాస ఆడక ఏడుపులు లంఘించుకోవడంతో చేసేదేమీ లేక జోరున కురుస్తున్న వానలో విమానం దిగి వెళ్లిపోయారు. 
 
అదేవిమానంలో ఉన్న ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ దీపాంకర్‌ రే ఈ చేదు అనుభవాన్ని మీడియాకు వెల్లడించారు. దీంతో పైలట్ చేసిన పనిపై స్పందించని ఎయిర్ ఏషియా యాజమాన్యం, విమానం ఆలస్యానికి మాత్రం క్షమాపణలు కోరింది.