శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2016 (11:52 IST)

బీహార్‌లో రాజకీయ హత్య: తేజస్వీపై పోటీ చేసిన బైజ్ నాథీ సింగ్‌ను రౌడీలు తుపాకులతో?

బీహార్‌లో రౌడీ మూకలు తుపాకులతో స్వైర విహారం చేశారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పుత్రరత్నం తేజస్వీ యాదవ్‌పై గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిన లోక్ జనశక్తి పార్టీ నేత రాకేశ్ తండ్రి, ఆ పార్టీ కీలక నేత బైజ్ నాథీ సింగ్‌ను రౌడీలు తుపాకులతో కాల్చి చంపేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. పాట్నా నుంచి రఘోపూర్ బయల్దేరిన సింగ్‌పై రఘోపూర్ సమీపంలో రౌడీలు విరుచుకుపడ్డారు. 
 
భార్య, కుమారుడు మరో మహిళతో కలిసి ప్రయాణిస్తున్న బైజ్ నాథీ సింగ్ కారును అడ్డగించి రౌడీలు ఏకే-47 తుపాకీతో కాల్పులు జరిపారు. 30 రౌండ్ల పాటు జరిగిన ఈ కాల్పుల్లో.. 15 బుల్లెట్లు సింగ్ శరీరంలోకి దూసుకెళ్లాయి. ఈ దాడిలో గాయపడ్డ ముగ్గురిని ఆసుపత్రికి తరలించేలోపే సింగ్ మరణించగా, ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉంది. 
 
కాహా బీహార్లో శాంతి భద్రతల పరిస్థితి రోజు రోజుకీ క్షీణిస్తోంది. ఇప్పటికే పలు ఇంజినీర్ల హత్యలతో ఆ రాష్ట్రంలోకి గతంలోని గూండారాజ్ ప్రవేశించిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గడచిన రెండు టెర్మ్‌లలో గూండారాజ్‌ను కూకటివేళ్లతో పెకలించిన ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్, మూడో దఫా లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని గెలిచిన సంగతి తెలిసిందే. 
 
అయితే ఈ దఫా నితీశ్ కుమార్ అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ఆ రాష్ట్రంలో నేరగాళ్లు రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ ఘటనలో కారులోనే ఉన్న లోక్ జనశక్తి పార్టీ నేత రాకేశ్‌కు గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు.