1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2024 (11:28 IST)

కర్మ వెంటాడుతుంది.. కేజ్రీవాల్ అరెస్టుపై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె!

Sharmistha Mukherjee
Sharmistha Mukherjee
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అంశం ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన అరెస్టును ఒక్క భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే భాగస్వామ్యపక్షాలు మినహా మిగిలిన అన్ని పార్టీలు తీవ్రంగా ఖండిస్తూ, వ్యతిరేకిస్తున్నాయి. అయితే, కాంగ్రెస్ వృద్ధనేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ట ముఖర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ మహిళా నాయకురాలు షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేజ్రీవాల్, అన్నా హజారే గ్రూపు ఆమెపై నిరాధారమైన ఎన్నో ఆరోపణలు చేశారని ఆరోపించారు. షీలాపై చేసిన ఆరోపణలకు సంబంధించి ప్రజలకు ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారని అన్నారు. 
 
కర్మ ఫలితం వెంటాడుతుందన్నారు. ఎవరైతే గతంలో అసత్య, నిరాధారమైన ఆరోపణలు చేశారో.. ఆ చర్యలకు వారంతా ఇపుడు ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నారని ఎద్దేవా చేశారు. 
 
మరోవైపు, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు చేసిన కేజ్రీవాల్‌ను ప్రస్తుతం ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ఉన్నారు. 
 
ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా అక్కడే ఉన్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో కేజ్రీవాల్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టబోతున్నారు. ఆయనను పది రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర కోరనున్నారు.