శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (10:26 IST)

పక్కా ప్లాన్ ప్రకారమే స్టాలిన్‌పై దాడి.. మార్షల్స్ ముసుగులో ఐపీఎస్‌ల పిడిగుద్దులు

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, విపక్ష నేత ఎంకే.స్టాలిన్‌పై జరిగిన దాడి అనుకోని ఘటన కాదని, పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా మార్షల్స్ ముసు

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే వర్కింగ్  ప్రెసిడెంట్, విపక్ష నేత ఎంకే.స్టాలిన్‌పై జరిగిన దాడి అనుకోని ఘటన కాదని, పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా మార్షల్స్ ముసుగులో పలువురు ఐపీఎస్‌లో సభలోకి ప్రవేశించి స్టాలిన్‌పై దాడి చేసినట్టు డీఎంకే ఎమ్మెల్యేలు, నేతలు ఆరోపిస్తున్నారు. 
 
సభాపతి ధనపాల్ సభలో లేనిసమయంలో మార్షల్స్ ముసుగులో 9 మంది ఐపీఎస్ అధికారులు సభలోకి రావడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని వారు చెబుతున్నారు. వారిని అసెంబ్లీకి రప్పించి పథకం ప్రకారమే స్టాలిన్‌పై దాడి చేయించారని ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన బలమైన ఆధారాలను డీఎంకే సంపాదించినట్టు తెలుస్తోంది. గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆదేశాలపై జరిగిన విచారణలో ఆ 9 మంది ఐపీఎస్‌లను గుర్తించినట్టు సమాచారం.
 
స్పీకర్ సభలో లేని సమయంలో అసెంబ్లీలోకి వచ్చిన ఆ 9 మంది ఐపీఎస్‌లు స్టాలిన్‌ను బలవంతంగా ఎత్తుకుని బయట కుదేసినట్టు ఆధారాలు వెలుగు చూశాయి. అయితే సభలో విధ్వంసం జరుగుతుండడంతో అకస్మాత్తుగా వారిని రప్పించాల్సి వచ్చిందని అసెంబ్లీ కార్యదర్శి గవర్నర్‌కు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే అప్పటికప్పుడు వారికి యూనిఫాంలు ఎలా వచ్చాయో చెప్పాలని డీఎంకే నిలదీస్తోంది. 
 
డీఎంకే ఆధారాలతో ముందుకు రావడంతో నిబంధనల ఉల్లంఘన కింద ఈ వ్యవహారం ఐపీఎస్‌ల మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ముఖ్యమంత్రి పళనిస్వామి సర్కారు ఎదుర్కొన్న విశ్వాస పరీక్ష కూడా చెల్లదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.