శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వాసు
Last Updated : మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (18:22 IST)

క్విట్ ఇండియా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్...

అప్పుడెప్పుడో తెల్లవాళ్లని తరిమికొట్టేందుకు.. మహాత్మా గాంధీ చేసిన క్విట్ ఇండియా ఉద్యమం తరహాలో రాజస్థాన్ జిల్లా కలెక్టర్ ఇప్పుడు పాకిస్థానీలను తరిమికొట్టేందుకు క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడుపుతున్నాడు...
 
వివరాలలోకి వెళ్తే... పుల్వామా ఉగ్రదాడి తర్వాత నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లా యంత్రాంగం సంచలన నిర్ణయం తీసుకుంది. సెక్షన్ 144 క్రింద తక్షణం అమల్లోకి వచ్చేలా పలు ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ బికనీర్‌లో ఉన్న పాకిస్థానీలందరూ 48 గంటలలోగా భారతదేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశించారు. జిల్లాలోని హోటళ్లు, లాడ్జిలలో పాకిస్తాన్ దేశస్థులను అనుమతించవద్దని ఆయన కూడా ఆదేశించారు.
 
ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయనీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్న ఆయన పాకిస్తాన్‌కి చెందిన వారికెవ్వరికీ భారతీయులు పని కల్పించవద్దనీ... దాయాది దేశంతో ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించవద్దనీ సూచించడంతోపాటు రెండు నెలల వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయనీ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. 
 
కాగా పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా పాకిస్తాన్ కళాకారులపై నిషేధం విధిస్తూ ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 
 
మరోవైపు భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉత్పత్తులపై సుంకాలను 200 శాతం పెంచడంతోపాటు పాకిస్తాన్‌కు అత్యంత అనుకూల దేశం(ఎంఎఫ్ఎస్) హోదాని కూడా తొలగించింది.
 
ఇది కలెక్టర్‌గారు చేస్తున్న మరో క్విట్ ఇండియా ఉద్యమం అనే అనిపిస్తోంది...