శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 22 సెప్టెంబరు 2014 (12:54 IST)

జైపూర్ : గ్యాంగ్ రేప్ నిందితుల అరెస్టు కంటే మంత్రి కుక్క ఆచూకే ముఖ్యం!

రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ సిటీలోని వైశాలి నగర్‌లో జరిగిన దోపిడీ, అత్యాచార సంఘటనల కంటే... ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి  రాజేంద్ర రాథోడ్ కుక్క తప్పిపోయిందన్న ఫిర్యాదు అక్కడి పోలీసులకు మరింత తలనొప్పిగా మారింది. దీంతో గ్యాంగ్ రేప్, దోపిడీ కేసు విచారణను పక్కనబెట్టి.. కనిపించకుండా పోయిన కుక్కపిల్ల కోసం వారు గాలించడం మొదలుపెట్టారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
సామూహిక అత్యాచారం, దోపిడీ కేసు విచారణలో తల మునకలై ఉన్న రాజస్థాన్ పోలీసులకు.. ఓ అర్జంట్ ఫోన్ కాల్ ఒకటి వచ్చింది. దాంతో ఆ కేసును పక్కన పెట్టి అంతా రోడ్ల మీద పడ్డారు. విషయమేమిటంటే, ఓ మంత్రిగారు పెంచుకుంటున్న మూడేళ్ల కుక్కపిల్ల తప్పిపోయిందనీ, అది బీగిల్ జాతికి చెందిన చార్లీ అని, దీన్ని తక్షణం పట్టుకోవాలన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. ఇదే అంశంపై సొడాలా పోలీసు స్టేషన్లో శనివారం సాయంత్రం ఫిర్యాదు కూడా చేశారు. వెంటనే అక్కడి పోలీసులు ఇతర స్టేషన్లకు కూడా సమాచారం ఇచ్చి, దాన్ని 'వీలైనంత తొందరగా' కనిపెట్టాలని చెప్పారు. ఫలితంగా ఆదివారం అంతా పోలీసులు ఆ కుక్కపిల్ల కోసం వెతుకుతూనే ఉన్నారు.
 
''కుక్కపిల్లలు, ఇతర పెంపుడు జంతువులు పోయాయన్న ఫిర్యాదులు మాకు రోజూ వస్తూనే ఉంటాయి. అది మంత్రిదైతే ఏమవుతుంది? అది కనిపించగానే మేం దాని యజమానికి అప్పగించాలి'' అని ఇన్స్పెక్టర్ విద్యా ప్రకాష్ చెప్పారు. చార్లీ ఆచూకీ ఎవరైనా చెబితే వాళ్లకు రూ.10 వేల బహుమతి ఇస్తామంటూ పోస్టర్లు కూడా వెలిశాయి. అయితే.. సామూహిక అత్యాచారం, దోపిడీ లాంటి పెద్దకేసును వదిలేసి ఇలాంటి కేసును పట్టుకోవడంపై పలువురు నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.