గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 17 జూన్ 2019 (21:46 IST)

కుమార్తె చనిపోలేదు.. నిద్రపోతోంది.. బిడ్డ శవం ముందు నెలరోజులుగా...

సాధారణంగా శవం పక్కన కొద్దిసేపు కూర్చోవాలంటేనే భయం వేస్తుంది. అలాంటిది ఆ దంపతులు తమ బిడ్డ శవం పక్కన ఏకంగా నెల రోజుల పాటు కూర్చొన్నారు. తీరా వివరాలు అడిగి తెలుసుకుని పోలీసులు నిర్ఘాంతపోయారు.
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మిర్జాపూర్‌లో వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, ఈ రాష్ట్రానికి చెందిన రిటైర్డ్‌ పోలీసు అధికారి, ఆయన భార్య మిర్జాపూర్‌లోని హయత్‌నగర్‌లో ఏరియాలో ఓ ఇంటిలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఓ కుమార్తె ఉంది.
 
అయితే, గత కొన్ని రోజులుగా మాజీ పోలీసు అధికారి ఇంటి నుంచి వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడకు వచ్చి ఆ ఇంటిని పరిశీలించగా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న ఓ శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ ఘటనపై ఆ దంపతులను విచారించగా.. తమ కూతురు చనిపోలేదని, నిద్రపోతుందని సమాధానం చెప్పడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. అంతేకాకుండా తామంతా కలిసే ఉన్నామని, తమ ఇంట్లో ఎలాంటి దుర్వాసన రావడం లేదని పిచ్చి పిచ్చి సమాధానాలు ఇచ్చారు. 
 
వారు చెప్పే సమాధానాలు ఏమాత్రం పొంతనలేకపోవడంతో చుట్టుపక్కల వారిని విచారించారు. ఈ విచారణలో ఆ దంపతులు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని, ఎవరితో సరిగా మాట్లాడేవారు కాదని చెప్పారు. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకి తరలించారు. మానసిక రుగ్మతతో బాధపడుతున్న దంపతులు అనుకోకుండా తమ కూతురిని హత్య చేసి ఉండవచ్చని, పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చాక పూర్తి దర్యాప్తు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు.