మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 8 ఆగస్టు 2018 (19:26 IST)

'అన్నా' పక్కనే సేదతీరిన 'సూరీడు'... ముగిసిన కరుణ మహాప్రస్థానం

డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. ఆయన ఆరోగ్యం చికిత్సకు ఏమాత్రం స్పందించడం లేదని కావేరీ ఆస్పత్రి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు విడుదల చేసిన వైద్య బులిటెన్‌లో పేర్కొంది.

ద్రవిడ సూరీడు శాశ్వతంగా సేదతీరారు. 94 యేళ్ల వ్యక్తిగత జీవితంలో 80 యేళ్ల పాటు ప్రజల కోసం రాజకీయాలు చేసిన ద్రవిడ యోధుడు ముత్తువేల్ కరుణానిధి విశ్రాంతి తీసుకున్నారు. చెన్నై మెరీనా తీరంలో ఉన్న అన్నా సమాధి పక్కనే డీఎంకే అధినేత కరుణానిధి మహాప్రస్థానం ముగిసింది. ఈ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో త్రివిధ దళాల సైనిక వందనంతో పూర్తి చేశారు.
 
మంగళవారం రాత్రి 6.10 గంటలకు చనిపోయిన కరుణానిధి పార్ధీవ దేహాన్ని తొలుత ఆయన నివాసమైన గోపాలపురం, ఆ తర్వాత సీఐటీ నగరం, అక్కడ నుంచి అన్నాశాలైలోని రాజాజీ హాల్‌కు తరలించారు. అక్కడ ప్రజల సందర్శనార్థం కరుణ భౌతికకాయాన్ని ఉంచారు. అక్కడ నుంచి సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర వాలాజా రోడ్‌, చెపాక్‌ స్టేడియం మీదుగా దాదాపు రెండు గంటలకు పైగా కొనసాగింది. 
 
దారి పొడువునా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు కరుణానిధికి కన్నీటి నివాళులర్పించారు. కరుణను చూసేందుకు ప్రజలు రహదారుల వెంట భారీ సంఖ్యలో చేరారు. తమ ప్రియతమ నాయకుడి కడచూపు కోసం ప్రజలు, డీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర, జాతీయ నేతల సమక్షంలో కరుణానిధి అంత్యక్రియలు ముగిశాయి. 
 
ఈ అంత్యక్రియలకు జేడీయూ నేత, మాజీ ప్రధాని దేవెగౌడ, రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌ నేతలు గులాంనబీ అజాద్‌, వీరప్పమొయిలీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి తదితరులు కరుణానిధి పార్థివదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. 
 
అయితే, కరుణ అంత్యక్రియల కోసం తయారు చేసిన శవపేటికపై కొన్ని వాక్యాలను చెక్కించారు. శవపేటికపై తమిళంలో…. "విశ్రాంతి లేకుండా ప్రజల అభ్యున్నతి కోసం పనిచేసిన వ్యక్తి" అని రాసి ఉంది. కరుణానిధి ఓ సందర్భంతో తన కొడుకు స్టాలిన్‌తో…. మన సమాధి చూసిన జనాలు విశ్రాంతి లేకుండా ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం ఇక్కడ సేద తీరుతున్నారని అనుకోవాలని చెప్పారు. ఈ మాటలను గుర్తుపెట్టుకున్న స్టాలిన్.. నాడు తన తండ్రి చెప్పిన మాటలనే ఈ శవపేటికపై చెక్కించారు.