1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 22 సెప్టెంబరు 2014 (10:43 IST)

వైద్యులు.. ఉరితీసే కర్కోటకుల లాంటి వారే: పప్పూ యాదవ్

వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువైన ఆర్జేడీ ఎంపీ పప్పూ యాదవ్ మరోమారు వైద్యులపై విరుచుకుపడ్డారు. వైద్యుల ధనార్జనపై గతంలోనూ ఘాటు వ్యాఖ్యలు చేసిన పప్పూ యాదవ్ అక్టోబర్ 13 నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు తెర తీయనున్నారు. ఈ క్రమంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన వైద్యులను ఉరి తీసే కర్కశులుగా అభివర్ణించారు. 
 
"వైద్య రంగంలో సేవలందిస్తున్న వారిలో 10-15 శాతం మంది మాత్రమే నిజాయతీగా పనిచేస్తున్నారు. మిగిలిన వారంతా ఉరితీసే కర్కోటకుల లాంటి వారే. నరమాంసం భక్షించే క్రూరులే. వారంతా అవినీతి ఊబిలో కూరుకుపోయి మధ్య దళారులుగా వ్యవహరిస్తున్నారు. మనుషులను నిలువునా కోసేసి ధనార్జన చేస్తున్నారు" అంటూ ఆయన వైద్య వృత్తిలో పేరుకుపోయిన అవినీతిపై ధ్వజమెత్తారు. వైద్యరంగంలో అవినీతికి చెక్ పెట్టేందుకు నర్సింగ్ హోం యాక్టును అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.