మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 డిశెంబరు 2017 (18:07 IST)

#RKNagarElectionResult : అమ్మతోడుగా అంచనాలు తలకిందులు

చెన్నై, ఆర్.కె.నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అమ్మతోడుగా అందరి అంచనాలు తలకిందులయ్యాయి. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన శశికళ వర్గానికి చెందిన టీటీవీ దినకరన్ ఘన విజయం సాధి

చెన్నై, ఆర్.కె.నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అమ్మతోడుగా అందరి అంచనాలు తలకిందులయ్యాయి. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన శశికళ వర్గానికి చెందిన టీటీవీ దినకరన్ ఘన విజయం సాధించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి చివరి రౌండ్ ముగిసేంత వరకు టీటీవీ దినకరన్ భారీ ఆధిక్యంలోనే కొనసాగారు. ఆయనకు మొత్తం 51 శాతం ఓట్లు పోలయ్యాయి.
 
అదేసమయంలో అధికార అన్నాడీఎంకే అభ్యర్థిగా బరిలోకి దిగిన సీనియర్ నేత, ఆ పార్టీ ప్రిసీడియం ఛైర్మన్ ఇ. మధుసూదనన్ రెండో స్థానానికి పరిమితం కాగా, గట్టి పోటీ ఇస్తాడని భావించిన డీఎంకే అభ్యర్థి మరుదు గణేష్ మూడో స్థానంతో  సరిపుచ్చుకోవడమే కాకుండా, చివరకు ధరావత్తును కూడా కోల్పోయారు. 
 
మరోవైపు, ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కరు నాగరాజన్‌కు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఈయనకు 1417 ఓట్లు మాత్రమే రాగా, నోటా బటన్‌కు 2373 ఓట్లు పోలయ్యాయి. అంటే నోటా కంటే బీజేపీ అభ్యర్థి తక్కువ పోల్ కావడం ఇపుడు సర్వాత చర్చనీయాంశంగా మారింది. 
 
ఒక జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ, 2014 నుంచి 2017 వరకు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో విజయభేరీ మోగిస్తూ, అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో తమినాడులో కూడా అధికారంలోకి వస్తామని ప్రగల్భాలు పలుకుతున్న బీజేపీ నేతలకు ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సాధించిన ఓట్లు ఓ గుణపాఠంలా మారనున్నాయి.