గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 8 అక్టోబరు 2019 (14:42 IST)

జగన్ సర్కార్‌కు ఆ శక్తి వుందా? ఎస్​బీఐ సందేహం...

అప్పు ఇస్తాం సరే... తీర్చే శక్తి ఉందా అంటూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్‌ ఆర్థిక కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షాక్ ఇచ్చింది. ఇప్పటికే తీసుకున్న రుణాలపై వస్తున్న ఆదాయమెంత? మళ్లీ అప్పు తీసుకుంటే ఎలా కడతారంటూ లేఖాస్త్రాన్ని సంధించింది.

రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంటుందన్నప్పటికీ సందేహం వ్యక్తం చేసింది. అప్పు ఇవ్వాలంటే ముందుగా తీసుకునే వారికి తిరిగి తీర్చగలికే శక్తి ఉందో లేదో బ్యాంకులు సమూలంగా పరిశీలిస్తాయి. ఆర్థికపరంగా అన్నీ అంశాలు బేరీజు వేసుకున్న తర్వాతే రుణం ఇస్తాయి. అయితే ప్రభుత్వాలు గ్యారంటీ ఇచ్చే ఏ సంస్థకైనా ఇట్టే అప్పు పుడుతుంది.

కానీ... ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ ఆర్థిక కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీపీఎఫ్​సీఎల్)కు అప్పు పుట్టడం కష్టంగానే ఉంది. రుణానికి గ్యారంటీ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా..స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్​బీఐ) సందేహిస్తోంది. అసలు అప్పును ఎలా తీర్చగలరంటూ ప్రశ్నలను సంధిస్తోంది.

మీకు అప్పిస్తే తీర్చగలిగే శక్తి ఉందా? అప్పుగా తీసుకున్న మొత్తంతో ఏం చేస్తారు? ఇప్పటికే తీసుకున్న అప్పుల ద్వారా ఏమైనా సంపాదిస్తున్నారా అంటూ ఏపీపీఎఫ్​సీఎల్​ను సూటిగా ప్రశ్నిస్తోంది రాష్ట్రంలో గత ప్రభుత్వాలిచ్చిన హామీలను తర్వాత వచ్చే ప్రభుత్వాలు గౌరవించటం లేదని రుణ మంజూరు విషంయలో దీనినీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ సర్కారు మీదా పరోక్షంగా అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

తమ సందేహాలు, అభ్యంతరాలకు సమాధానం ఇవ్వాలంటూ ఏపీపీఎఫ్​సీఎల్ ఎండీకి ఎస్​బీఐ లేఖ రాసింది. 2018-19ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 2లక్షల 52 వేల కోట్లు ఉన్నాయని 2020 నాటికి అవి 3 లక్షల కోట్లుకు చేరుతాయని బ్రిక్‌వర్క్ సంస్థ నివేదిక ద్వారా తెలుస్తోందని ఏపీపీఎఫ్​సీఎల్ ఎండీకి రాసిన లేఖలో ఎస్​బీఐ పేర్కొంది.

ప్రస్తుతం ఏపీపీఎఫ్​సీఎల్ ప్రతిపాదించిన 3వేల కోట్లు రుణానికి ప్రభుత్వం హామీగా ఉండటం వల్ల రుణభారం అసాధారణంగా పెరుగుతుందని అభిప్రాయపడింది. కంపెనీ బాండ్లకు క్రిసిల్ సంస్థ ఇచ్చిన డీ గ్రేడ్‌ రేటింగ్‌ ఆధారంగా సంస్థ తీసుకున్న అప్పులతో ఆదాయం సంపాదించడం ప్రశ్నార్థకంగా ఉందని లేఖలో పేర్కొంది.

దీన్ని దృష్టిలోఉంచుకుని రుణం తిరిగి చెల్లింపు..అందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని బ్యాంకు సూచించింది. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు, వివరణలు పంపితే వాటిని తమ కార్పొరేట్‌ కార్యాలయానికి పంపుతామని తెలిపింది.