ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 జూన్ 2020 (20:27 IST)

370 ఆర్టికల్ రద్దు ఎఫెక్టు : తప్పుకున్న హురియత్ అగ్రనేత!

ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ వచ్చిన ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దీంతో అనేక వేర్పాటువాద నేతలు, సంస్థలు మిన్నకుండిపోయాయి. ఈ క్రమంలో తాజాగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. 
 
సుమారుగా మూడు దశాబ్దాలుగా వేర్పాటువాద రాజకీయాలు చేస్తూ వస్తున్న సయ్యద్ అలీ షా గిలానీ హురియత్ కాన్ఫరెన్సుకు గుడ్ బై చెప్పారు. 1990ల నుంచి కాశ్మీర్ వేర్పాటువాద ఉద్యమాన్ని ఆయన నడిపించారు. హురియత్‌కు ఆయన జీవితకాల ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 90 ఏళ్ల గిలానీ ఇప్పుడు హురియత్‌ను వీడటం కాశ్మీర్ లోయతో పాటు, పాకిస్థాన్‌లో కూడా చర్చనీయాంశంగా మారింది.
 
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలోనే హురియత్‌కు తాను రాజీనామా చేస్తున్నానని ఓ ఆడియో మెసేజ్ ద్వారా గిలానీ తెలిపారు. తన రాజీనామాకు గల కారణాలన్నింటినీ హురియత్‌కు పంపిన రాజీనామా లేఖలో వివరంగా పేర్కొన్నానని చెప్పారు. తాను చేసిన పోరాటాలు, ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
హురియత్‌లో నిధుల దుర్వినియోగంతో పాటు పలు అవకతవకలు జరిగాయని... వీటన్నింటికీ సమాధానాన్ని మీరు చెప్పాల్సి ఉందని లేఖలో ఆయన అన్నారు. తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేశారని, కుట్రలు పన్నారని ఆరోపించారు. హురియత్‌లో క్రమశిక్షణ కొరవడిందని విమర్శించారు. 
 
మరోవైపు, గిలానీ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారంటూ పాకిస్థాన్‌కు చెందిన కొన్ని గ్రూపులు ఆయనను టార్గెట్ చేశాయి. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్ముకాశ్మీర్ లో చోటుచేసుకున్న కీలక పరిణామం ఇదే కావడం గమనార్హం.