శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 8 ఆగస్టు 2018 (12:42 IST)

ఒక్కసారి నాన్నా అని పిలవొచ్చా తలైవా... కన్నీరు తెప్పిస్తున్న స్టాలిన్ లేఖ

తన తండ్రి కరుణానిధి మరణాన్ని ఆయన రెండో కుమారుడు ఎంకే స్టాలిన్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. పార్టీ అధినేతగా కరుణానిధి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా స్టాలిన్ ముందుండి పార్టీని నడిపిస్తూ వచ్చారు. ఈ క్రమ

తన తండ్రి కరుణానిధి మరణాన్ని ఆయన రెండో కుమారుడు ఎంకే స్టాలిన్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. పార్టీ అధినేతగా కరుణానిధి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా స్టాలిన్ ముందుండి పార్టీని నడిపిస్తూ వచ్చారు. ఈ క్రమంలో గత యేడాదిన్నర కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన కరుణానిధి మంగళవారం రాత్రి కన్నుమూశారు.
 
ఆ తర్వాత స్టాలిన్ తన స్వదస్తూరితో కార్యకర్తల కోసం ఓ లేఖ రాశారు. ఈ లేఖ ప్రతి ఒక్కరిని గుండెలు పిండేసేలావుంది. కంట కన్నీరు తెప్పిస్తోంది. కరుడుగట్టిన తమిళ రాజకీయవాది, ద్రవిడ ఉద్యమకారుడిగా పేరుగాంచిన కరుణానిధిని గుర్తుచేసుకుంటూ కుమారుడు స్టాలిన్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా రాసిన లేఖలో తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 
 
ఇంతకాలం మిమ్మల్ని అప్పా (నాన్నా) అని కాకుండా తలైవరే (అధ్యక్షా) అనే ఎక్కువసార్లు పిలిచాను. చివరిసారిగా ఒక్కసారి మిమ్మల్ని అప్పా (నాన్నా) అని పిలవచ్చా తలైవరే. తమిళ రాష్ట్ర సంక్షేమం కోసం మీరు చేసిన సేవ పూర్తైందనుకుని వెళ్లిపోయారా నాన్నా.. మీరు ఎక్కడికి వెళ్లినా నాకు చెప్పకుండా వెళ్లేవారు కాదు. కానీ ఈ సారి ఎందుకు చెప్పకుండా వెళ్లిపోయారు? ఒక్కసారి నా ప్రియమైన సోదరులారా.. అని మమ్మల్ని పిలవండి. ఆ పలుకే మరో శతాబ్దం వరకు కలిసి పోరాడేందుకు మాకు శక్తినిస్తాయి. 
 
80 ఏళ్లుగా మీరు తమిళనాడు కోసం చేసిన సేవలు, సాధించిన రికార్డులు మీకే సాధ్యం. జూన్‌ 3న మీ పుట్టినరోజు, మీకున్న నైపుణ్యాలలో సగం వంతు నాకు ఇవ్వండి అని ఒకసారి మిమ్మల్ని వేడుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మీ గురువు అన్నాదురై వెళ్లిపోతూ ఆయన హృదయాన్ని మీకు ఇచ్చినట్లే.. మీ హృదయం నాకు ఇస్తారా? ఎందుకంటే మీరు కన్న కలలు మేం పూర్తి చేస్తాం. అంటూ భావోద్వేగంతో స్టాలిన్ లేఖలో తెలిపారు.