షీనా బోరా హత్య కేసు : సెప్టెంబర్ 5 వరకు ఇంద్రాణికి పోలీసు కస్టడీ
షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియాకు బాంద్రా కోర్టు సెప్టెంబర్ ఐదో తేదీ వరకు పోలీసు కస్టడీని పొడగించింది. ఈ కేసులో ఇంద్రాణి కారు డ్రైవర్ శ్యామ్ రాయ్ను ఆగస్టు 21వ తేదీన అరెస్టు చేయగా, ఇంద్రాణిని ఆగస్టు 25వ తేదీన, ఈమె రెండో మాజీ భర్త సంజీవ్ ఖన్నాను 26వ తేదీన కోల్కతాలో అరెస్టు చేశారు.
అయితే, వీరికి విధించిన పోలీసు కస్టడీ సోమవారంతో ముగిసింది. దీంతో వీరందరినీ కోర్టులో హాజరుపరిచారు. అదేసమయంలో ఈ కేసులో మరింతమందికి సంబంధం ఉన్నట్టు తెలుస్తోందని, అందువల్ల మరిన్ని విషయాలు రాబట్టేందుకు వీలుగా ఇంద్రాణికి కస్టడీని పొడగించాలని ముంబై పోలీసులు కోర్టును కోరారు. వీర విన్నపాన్ని పరిశీలించిన కోర్టు.. ఇంద్రాణికి సెప్టెంబర్ 5వ తేదీ వరకు కస్టడీ పొడగిస్తూ ఆదేశాలు జారీచేసింది.
మరోవైపు స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖర్జియా సతీమణి అయిన ఇంద్రాణి ముఖర్జియా వద్ద ముంబై పోలీసులు ఇప్పటికే 80 నుంచి 90 గంటల పాటు ప్రశ్నించారు. ఈమెపై ఐపీసీ సెక్షన్ 307పై కూడా ప్రయోగించారు. అంతేకాకుండా, తన కుమారుడైన మైఖేల్ బోరాను కూడా హత్య చేసేందుకు ఇంద్రాణి ప్రయత్నించిందని పోలీసులు ఆరోపిస్తూ.. హత్యాయత్న కేసును కూడా నమోదు చేశారు.
ఇదిలావుండగా, ఇంద్రాణి తరపు న్యాయవాది మాత్రం తన క్లయింట్పై విచారణలో భాగంగా ముంబై పోలీసులు భౌతికంగా దాడిచేశారని ఆరోపించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం రాబట్టేందుకు వీలుగా ఈ దాడి చేసినట్టు చెప్పారు. ముఖ్యంగా ఇంద్రాణి చెంపపై పదేపదే కొట్టారని, దీంతో ఆమె చెంప వాచిపోయివుందని చెపుతున్నారు.