శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 నవంబరు 2019 (12:43 IST)

మహా పీఠంపై శివసైనికుడే ముఖ్యమంత్రి : సంజయ్ రౌత్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై శివసైనికుడే కూర్చొంటారాని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ఎల్పీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ స్పందిస్తూ, ఆరునూరైనా శివసైనికుడే సీఎం అవుతారన్నారు. ప్రతిపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. 
 
'ఒప్పందాలు చేసుకోవడానికి మేము వ్యాపారులము కాదు. శివసేనకు రాజకీయాలంటే వ్యాపారం కాదు. లాభ, నష్టాలు అనే పదాలు మా డిక్షనరీలో లేవు' అని స్పష్టంచేశారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆహ్వానిస్తామని సంజత్‌రౌత్‌ తెలిపారు. 
 
'జర్మనీ నియంత హిట్లర్‌లా బీజేపీ వ్యవహరిస్తున్నది. ఢిల్లీకి మహారాష్ట్ర బానిసగా ఉండదు' అని వ్యాఖ్యానించారు. కాగా ముంబైలోని రీట్రీట్‌ హోటల్‌లో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేలను శివసేన యువనేత అదిత్య ఠాక్రే శనివారం అర్థరాత్రి కలిశారు. వీరి మధ్య సమావేశం ఆదివారం తెల్లవారుజామున 5 గంటల వరకు జరిగినట్లు సమాచారం. ఆదివారం ఉద్ధవ్‌ ఠాక్రే, ఆయన భార్య రష్మీ ఠాక్రే కూడా ఎమ్మెల్యేలతో సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించారు.