గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By కుమార్
Last Updated : మంగళవారం, 28 మే 2019 (17:01 IST)

సిక్కిం సీఎం అదుర్స్.. ప్రభుత్వ ఉద్యోగులకు 5 రోజుల వేతనం ప్లస్ సెలవులు

సిక్కిం క్రాంతికారి మోర్చా అధ్యక్షుడు ప్రేమ్‌ సింహ్‌ తమాంగ్‌ అలియాస్‌ పీఎస్‌ గోలే సిక్కిం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా వస్తూనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం టాషిలింగ్ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ అధికారులతో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు. 
 
ప్రభుత్వంలోని సీనియర్ అధికారులతో సమావేశం పూర్తయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ సిక్కిం రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు వరుసగా ఐదు రోజులపాటు సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని, ఎన్నికల హామీల్లో చెప్పినట్లుగా ఉద్యోగుల పని భారాన్నే కాకుండా పని సమయాన్ని కూడా తగ్గిస్తామని, అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. 
 
అలాగే ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం వారంలో మరో సెలవు దినాన్ని పెంచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇంకా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, మంత్రి వర్గంతో సహా తాను కూడా ఫార్చూనర్ స్పోర్ట్స్ యుటిలేటెడ్ వెహికిల్ కాకుండా స్కార్పియో వాహనాలను ఉపయోగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఖర్చులు ఎక్కువ చేయకుండా రాష్ట్ర ఆదాయాన్ని పెంచే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని గోలే తెలియజేశారు.