గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఇంతకాలం మా కుటుంబాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు : ఎస్పీజీ చీఫ్‌కు సోనియా లేఖ

ఇంతకాలం మా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడినందుకు ధన్యవాదాలు అంటూ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీజీ) చీఫ్‌ అరుణ్ సిన్హాకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన లేఖలో పేర్కొన్నారు. 
 
ప్రముఖ నాయకులకు కల్పించే వ్యక్తిగత భద్రతపై ఐదేళ్లకోసారి జరిపే సమీక్షలో కేంద్రం ఎస్పీజీ భద్రతను ఇటీవల తొలగించింది. ఈ నేపథ్యంలో సోనియా, ఎస్పీజీ చీఫ్ అరుణ్ సిన్హాకు లేఖ రాశారు. అంకిత భావంతో 28 ఏళ్ల నుంచి తమ కుటుంబానికి కల్పించిన భద్రత పట్ల ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
 
'ఎస్పీజీని కేటాయించినప్పటి నుంచి మా కుటుంబం సురక్షితంగా ఉంది. అది మావెంట ఉండటంతో మా బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించగలిగాం. ఎస్పీజీ అద్భుతమైన దళం. బలగాలకు దేశభక్తితోపాటు, పనిని ఖచ్చితంగా నిర్వహించే సామర్థ్యముంది. మా కుటుంబానికి అంకితభావంతో రక్షణ కల్పించినందుకు ప్రశంసిస్తున్నా' అని ఆమె వ్యాఖ్యానించారు. 
 
కాగా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలకు కల్పిస్తూ వచ్చిన ఎస్పీజీ రక్షణ విభాగాన్ని తొలగించి, ఇకపై వంద మందితో కూడిన జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించనున్నారు.