శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 25 నవంబరు 2020 (05:38 IST)

మన అధినేతల కోసం ప్రత్యేక విమానం.. తొలి పర్యటన రామ్ నాధ్ దే

ప్రభుత్వ పెద్దల ప్రయాణం కోసం భారత్‌ ఓ ప్రత్యేక విమానాన్ని బోయింగ్‌ సంస్థ నుండి అందుకుంది. అమెరికా అధ్యక్షుడి ప్రయాణాల కోసం అత్యున్నత భద్రతా ఏర్పాట్లతో కూడిన ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానం ఉపయోగిస్తారు.

ఇదే నేపథ్యంలో.. భారత్‌ కూడా ఇటీవల అలాంటి ఈ బోయింగ్‌ 777-300 ఈఆర్‌ విమానాన్ని వినియోగంలోకి తెచ్చింది. మొట్టమొదట అధికారిక ప్రయాణం చేసిన ఘనత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు దక్కింది. రాష్ట్రపతి దంపతులు మంగళవారం తిరుపతి వెంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి విచ్చేశారు.

దీనికిగాను ఢిల్లీ నుంచి ఈ 'ఎయిరిండియా వన్‌' విమానంలో రాష్ట్రపతి దంపతులు బయలుదేరి చెన్నైకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు ఢిల్లీలో కొత్త విమానానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెన్నై నుంచి భారత వాయుసేన విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు.

'ఎయిరిండియా వన్‌' విమానం కేవలం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రయాణాలకే వినియోగిస్తారు. ఇలాంటిదే మరో విమానాన్ని విదేశీ ప్రముఖులు భారత్‌ వచ్చినప్పుడు వారికోసం వినియోగిస్తారు.
 
విమానంలో శక్తివంతమైన ఆయుధ వ్యవస్థలు..
ఈ 'ఎయిరిండియా వన్‌' విమానంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో ప్రయాణ సదుపాయాలే కాదు, ఓ యుద్ధంలో పాల్గనేంత శక్తిమంతమైన ఆయుధ వ్యవస్థలు పొందుపరిచారు. మిస్సైల్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు (ఎండీఎస్‌), ఎలక్ట్రానిక్‌ వార్‌ ఫేర్‌ జామర్లు, క్షిపణి హెచ్చరిక వ్యవస్థలు దీంట్లో ఉన్నాయి.

ఇందులోని అధునాతన ఎలక్ట్రానిక్‌ వ్యవస్థలు శత్రు దేశాల రాడార్లను స్తంభింపచేస్తాయి. దీంట్లోని ఇన్‌ఫ్రారెడ్‌ సిగలింగ్‌ వ్యవస్థలు శత్రుదేశాల క్షిపణులను తప్పుదోవ పట్టించగలవు.

ఈ విమానం గంటకు 900 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. రెండు జీఈ 90-115 ఇంజిన్లతో దీన్ని పరిపుష్టం చేశారు. 'ఎయిరిండియా వన్‌' విమానం గాల్లోనే ఇంధనం నింపుకోగలదు. దీని ఖరీదు సుమారు రూ.8,400 కోట్లు !