శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 జనవరి 2016 (18:31 IST)

నేతాజీ మరణించేవుంటారన్న అనితా బోస్: రహస్య ఫైళ్లను విడుదల చేయనున్న మోడీ!

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 119వ జయంతిని పురస్కరించుకుని నేతాజీకి సంబంధించిన మరికొన్ని రహస్య ఫైళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం బహిర్గతం చేయనున్నారు. ఈ నేపథ్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నేతాజీ అయిన తన తండ్రి మరణించి వుంటారనే వార్తను తాను నమ్ముతున్నానని వ్యాఖ్యానించారు. తమ వద్ద తమ తండ్రికి సంబంధించిన ప్రత్యేక జ్ఞాపకాలేవీ లేనప్పటికీ, ఆయన గొప్పతనం గురించి తన తల్లి చెప్తుండేదన్నారు. 
 
దేశం కోసం జీవితాన్ని అర్పించిన గొప్ప వ్యక్తి మరణం వివాదాస్పదం కావడం, దాని ద్వారా ఆయన్ని ప్రజలు గుర్తించుకోవడం తనకు బాధ కలిగిస్తుందని అనితా వెల్లడించారు. నేతాజీకి సంబంధించిన అంశాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నాలపై అనితా బోస్ హర్షం వ్యక్తం చేశారు.

జపాన్‌లో ఉంచిన నేతాజీ అస్తికలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని, భారత్-జపాన్ ప్రభుత్వాలు ఈ వ్యవహారంపై తక్షణం స్పందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇంకా నేతాజీకి సంబంధించిన వాస్తవాలను జపాన్ బయటపెట్టకపోవడం ఆ దేశ ప్రతిష్టకు అవమానకరమైన విషయయని అనితా బోస్ పేర్కొన్నారు.