గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2019 (15:18 IST)

నిండు గర్భిణిపై సామూహిక అత్యాచారం.. సుప్రీం కోర్టు సంచలనం

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో బాధితురాలికి సత్వర న్యాయం చేయాలని సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. బాధితురాలికి సత్వర న్యాయం చేయాలని సుప్రీం కోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేకుంటే తీవ్ర పరిణామాలు వుంటాయని హెచ్చరించింది. 
 
నష్టపరిహారంగా 50లక్షల రూపాయలను చెల్లించాలని, బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలని ఆదేశించింది. దీన్ని అమలు చేయడానికి రెండు వారాల గడువు విధించింది సుప్రీంకోర్టు. గడువులోగా ప్రభుత్వం దీన్ని అమలు చేయకపోతే.. కోర్టు ధిక్కారణగా భావిస్తామని పేర్కొంది.
 
2002లో గోధ్రా ఘటన అనంతరం గుజరాత్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. మత కలహాలు చోటుచేసుకున్నాయి. ఓ వర్గం ప్రజలపై మరో వర్గం వారు దాడులకు పాల్పడ్డారు. ఆస్తులను ధ్వంసం చేశారు. గుజరాత్ వ్యాప్తంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. యధేచ్ఛగా దాడులు చోటుచేసుకుంటున్న సమయంలోనే అదే ఏడాది మార్చి 3వ తేదీన దాహోద్ జిల్లాలోని రంధిక్ పూర్ లో బిల్కిస్ బానో సామూహిక అత్యాచారానికి గురయ్యారు. అప్పటికి ఆమె వయస్సు 19 సంవత్సరాలు. నిండు గర్భిణి. 
 
అయినప్పటికీ.. దుండగులు ఆమెపై లైంగిక దాడి చేశారు. అప్పటి నుంచి న్యాయస్థానం చుట్టూ తిరుగుతూ వస్తోంది. ఈ కేసు విచారణ ఈ ఏడాది కొలిక్కి వచ్చింది. రంధిక్ పూర్ ఘటనలో బిల్కిస్ బానోను బాధితురాలిగా గుర్తించింది సుప్రీంకోర్టు. ఆమెకు వెంటనే 50 లక్షల రూపాయల నష్ట పరిహారం, ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ ఏడాది ఏప్రిల్ లోనే ఆదేశాలను జారీ చేసింది. 
 
దీనిపై గుజరాత్ ప్రభుత్వం రివ్యూ పిటీషన్‌ను దాఖలు చేసింది. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. మరోసారి తన నిర్ణయానికే కట్టుబడింది. ఇందులో పున: సమీక్షించడాని ఇంకేమీ మిగల్లేదని స్పష్టం చేసింది. రెండు వారాల్లో బాధితురాలికి నష్ట పరిహారాన్ని చెల్లించాల్సిందేనంటూ తేల్చి చెప్పింది.