గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 4 జులై 2019 (21:38 IST)

టిక్ టాక్ వీడియో విడిపోయిన భార్యాభర్తలను కలిపింది.. ఎక్కడ?

టిక్ టాక్‌తో జీవితాలు బలైన సంఘటనలు చూశాం. కానీ మొదటిసారిగా దంపతులను ఈ యాప్ కలిపింది. తమిళనాడులో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. తమిళనాడు క్రిష్ణగిరికి చెందిన సురేష్, జయప్రద దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే ఇద్దరి మధ్యా మనస్పర్థలు రావడంతో మూడేళ్ళ క్రితం కుటుంబాన్ని వదిలేసి సురేష్ వెళ్ళిపోయాడు. డ్యూటీకి అని చెప్పి అదృశ్యమయ్యాడు. పోలీసులకు జయప్రద ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయింది.
 
అన్ని ప్రయత్నాలు చేసిన కుటుంబ సభ్యులు..బంధువులు సురేష్ పై ఆశలు వదులుకున్నారు. దీంతో ఇద్దరు పిల్లలతో కలిసి జయప్రద కాలం వెల్లతీస్తోంది. భర్త ఇక రాడనుకుని బతుకుతున్న జయప్రదకు టిక్ టాక్ ఒక వరమైంది. 
 
సురేష్ పోలికలతో టిక్ టాక్ వీడియో చూసిన జయప్రద బంధువు వెంటనే ఆమెకు సమాచారం ఇచ్చాడు. ఆ వీడియోను పంపాడు. అతను తన భర్త సురేష్ అని జయప్రద నిర్థారించుకుంది. వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్ళింది. పోలీసులు రంగంలోకి దిగారు. చివరకు విల్లుపురంలో సురేష్ ను గుర్తించారు. ఓ ట్రాన్స్ జెండర్ మహిళతో కలిసి సురేష్ జీవిస్తున్నట్లు తేల్చారు. 
 
ట్రాన్స్‌జెండర్స్ అసోసియేషన్ సహకారంతో సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాలతోనే ఇంటి నుంచి వచ్చేశానని పోలీసులకు సురేష్ చెప్పాడు. ఓ ట్రాక్టర్ కంపెనీలో మెకానిక్‌గా పనిచేస్తున్నట్లు చెప్పాడు. చివరకు అందరికీ కౌన్సిలింగ్ చేసిన పోలీసులు సురేష్, జయప్రదలను ఏకం చేసి ఇంటికి పంపడంతో కథ సుఖాంతమైంది.