మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (13:10 IST)

దాడి చేసి.. గెంటేసి విశ్వాస పరీక్ష జరపడమా? ఇదెలా చెల్లుతుంది : మద్రాస్ హైకోర్టులో డీఎంకే పిటిషన్

తమపై మార్షల్స్‌తో దాడి చేసి.. బయటకు గెంటేసి విశ్వాస పరీక్ష నిర్వహించారనీ, ఇది ముమ్మాటికీ చెల్లదని పేర్కొంటూ ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే వాదిస్తోంది. ఇదే అంశంపై కోర్టును ఆశ్రయించింది. ఈనెల 18వ తేదీన తమి

తమపై మార్షల్స్‌తో దాడి చేసి.. బయటకు గెంటేసి విశ్వాస పరీక్ష నిర్వహించారనీ, ఇది ముమ్మాటికీ చెల్లదని పేర్కొంటూ ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే వాదిస్తోంది. ఇదే అంశంపై కోర్టును ఆశ్రయించింది. ఈనెల 18వ తేదీన తమిళనాడు అసెంబ్లీలో జరిగిన బలపరీక్షపై ప్రతిపక్ష డీఎంకే హైకోర్టులో సవాల్‌ చేసింది. ఈ విశ్వాస పరీక్ష శాసనసభ నియమాలను అనుసరించి జరగలేదని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. 
 
ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా స్వీకరించాలని డీఎంకే తరపు న్యాయవాది కోర్టును కోరగా దీనిపై రేపు విచారణ చేపడతామని న్యాయమూర్తులు జస్టిస్‌ జి.రమేష్‌, మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. బల పరీక్షలో భాగంగా రహస్య ఓటింగ్‌ను కోరినా స్పీకర్‌ ధన్‌పాల్‌ పట్టించుకోకుండా.. తమను సభ నుంచి బయటకు గెంటేశారని.. మార్షల్స్‌ తమపై దాడికి పాల్పడ్డారని డీఎంకే పిటిషన్‌లో ఆరోపించింది. ప్రతిపక్ష సభ్యులు లేకుండా సభలో జరిగిన విశ్వాస పరీక్ష ఏ రకంగానూ చెల్లదని పేర్కొంది.
 
కాగా, ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగి ఉన్న కేసులో శ‌శిక‌ళ న‌ట‌రాజ‌న్ జైలుకి వెళ్లిన తరువాత త‌మిళనాడు ముఖ్య‌మంత్రిగా నియ‌మితుడైన ప‌ళ‌నిస్వామి నియమితులైన విషయం తెల్సిందే. అప్పటి నుంచే ఆయనకు సొంత పార్టీ నేతలతో పాటు.. విపక్ష పార్టీలు చుక్కలు చూపుతున్నాయి. ఎన్నో నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య ఈ నెల 18న‌ అసెంబ్లీలో జ‌రిగిన విశ్వాస ప‌రీక్ష‌లో ఆయ‌న నెగ్గిన నేపథ్యంలో ఆ ప‌రీక్ష చెల్ల‌ద‌ని మ‌ద్రాసు హైకోర్టులో ఆ రాష్ట్ర ప్ర‌తిప‌క్షం డీఎంకే పిటిష‌న్ దాఖలు చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో త‌మిళ‌నాట మ‌రోసారి ఉత్కంఠ మొద‌లైంది. ఎన్నో ప్ర‌య‌త్నాలు జ‌రిపి చివ‌రికి బ‌ల‌ప‌రీక్ష‌ను నెగ్గిన ప‌ళ‌నిస్వామి మ‌రోసారి ఇర‌కాటంలో ప‌డే అవ‌కాశాలు ఉన్నట్టు ఇప్పటికే న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్న విషయం తెల్సిందే.