శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (13:12 IST)

ప్రే'ముంచాడు' : ప్రియురాలిని విడిచి మరో యువతితో పరారీ!

తమిళనాడు రాష్ట్రంలోని విళుపురంలో గాఢ ప్రేమ ఒకటి చేదుగా మారింది. ఏడేళ్ళ పాటు ప్రేమించాననీ, నీవే నా సర్వస్వమంటూ నమ్మించాడు. ముద్దూ ముచ్చటా తీర్చుకున్నాడు. ఈ క్రమంలో గర్భవతిని చేశాడు. దీంతో పెళ్లి చేసుకోవాలని ప్రియురాలి పట్టుబట్టడంతో వివాహం చేసుకుంటానని నమ్మించి గర్భస్రావం చేయించాడు. ఆ తర్వాత విషయం పెద్దలు నుంచి పంచాయతీకి వెళ్లడంతో పెళ్లికి ముహుర్తం ఖరారు చేశారు. తీరా పెళ్లి పీటల మీద ప్రేయసిని వదిలివేసి.. మరో యువతితో పరారయ్యాడు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. 
 
విళుపురం జిల్లా చిన్నసేలం నయినార్ పాళెం గ్రామానికి చెందిన ప్రియాంక (22), కురాల్ గ్రామానికి చెందిన జగదీష్ (23)లు ఏడేళ్ళపాటు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో జగదీష్ మాయమాటలను ప్రియాంక పూర్తిగా నమ్మింది. దీంతో అతను ఏం చేసినా మిన్నకుండి పోయింది. తీరా గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలని ప్రాధేయపడింది.
 
అయితే, కడుపులో పెరుగుతున్న బిడ్డ అడ్డును తొలగించేందుకు జగదీష్ సరికొత్త నాటకం ఆడాడు. పెళ్లి చేసుకోవాలంటే గర్భస్రావం చేయించుకోవాలంటూ మెలిక పెట్టాడు. ఈ మాటలను కూడా నమ్మిన ప్రియాంక ఇంట్లో తెలియకుండా అబార్షన్ చేయించుకుంది. ఆ తర్వాత జగదీష్ అసలు రంగు బయటపడింది. వివాహం చేసుకునేది లేదని తెగేసి చెప్పడంతో ప్రియాంక విషయాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లింది. వారు గ్రామ పంచాయతీ పెద్దలను ఆశ్రయించడంతో జగదీష్‌తో వివాహం చేయాలని తీర్పునిచ్చారు. 
 
ఆ ప్రకారం ఈనెల 17వ తేదీన వివాహం చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు. కూగైయూరులోని స్వర్ణపూరీశ్వరి శివాలయంలో పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ పెళ్లి కోసం ఇరు కుటుంబాల సభ్యులు ఆలయానికి చేరుకున్నారు. పెళ్లి పీటలపై పెండ్లి కుమార్తె కూర్చొనివుండగా, ప్రియుడు మరో యువతి మణిమేఘలైని పెళ్లి చేసుకుని పారిపోయినట్టు తెలిసింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు కళ్ళకురిచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా, రంగంలోకి దిగిన పోలీసులు జగదీష్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు.