1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (09:51 IST)

తమిళనాడు మంత్రుల అరెస్టుకు సిద్ధం.. అజ్ఞాతంలోకెళ్లి అమాత్యులు.. బెయిలు కోసం ప్రయత్నాలు

తమిళనాడు ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ నివాసంలో ఐటీ అధికారులు జరిపిన తనిఖీల సమయంలో మహిళా ఐటీ అధికారిణి పట్ల దురుసుగా ప్రవర్తించడమేకాకుండా, బెదిరించినట్టు నమోదైన కేసులో ఆ రాష్ట్రానికి చెందిన ముగ్గురు మంత్ర

తమిళనాడు ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ నివాసంలో ఐటీ అధికారులు జరిపిన తనిఖీల సమయంలో మహిళా ఐటీ అధికారిణి పట్ల దురుసుగా ప్రవర్తించడమేకాకుండా, బెదిరించినట్టు నమోదైన కేసులో ఆ రాష్ట్రానికి చెందిన ముగ్గురు మంత్రుల అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ మంత్రుల్లో ఉడుమలై రాధాకృష్ణన్, కామరాజ్‌, కడంబూరు రాజులతోపాటు ఢిల్లీలోని తమిళనాడు ప్రభుత్వ ప్రతినిధి దళవాయి సుందరంలు ఉన్నారు. 
 
ఈ నలుగురిపై స్థానిక అభిరామపురం పోలీసుస్టేషనలో శుక్రవారం రాత్రి నాన్ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అయితే ఈ విషయం తెలియగానే వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శని, ఆదివారాలు కోర్టులు సెలవులు కావడంతో అరెస్టు చేస్తే జైలుకెళ్లి రెండు రోజుల పాటు జైల్లో గడపాల్సి వస్తుందన్న భయంతో వారు కనిపించకుండా పోయారు. పైగా, వారి మొబైల్ ఫోన్లు కూడా స్విచాఫ్ అని వస్తున్నాయి. మరోవైపు.. ఈ కేసులో అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ కోసం వారు ప్రయత్నాలు చేస్తున్నారు.
 
ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో గెలుపుకోసం ఓటర్లకు భారీగా నగదు పంపిణీ చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌ నివాసగృహాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెల్సిందే. ఆ సమయంలో మంత్రులు రాధాకృష్ణన్, కామరాజ్‌, కడంబూరు రాజు, మాజీ మంత్రి దళవాయి సుందరంలు కార్యకర్తలతో వెళ్లి వారిని అడ్డుకోవడమే కాకుండా దురుసుగా ప్రవర్తించారు. ముఖ్యంగా.. ఐటీ మహిళా అధికారిణి పట్ల, అధికారులకు భద్రతగా వెళ్లిన సీఆర్పీఎఫ్‌ పోలీసులను దూరంగా నెట్టి.. కొన్ని దస్తావేజులను బయటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీనిపై ఐటీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి.