1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 26 జూన్ 2019 (14:22 IST)

చెన్నైలో మూతపడుతున్న హోటళ్లు.. లాడ్జీలు ఎందుకు?

చెన్నై మహానగరంలో హోటళ్లు మూతపడుతున్నాయి. దీనికి కారణం చుక్క నీరు లేకపోవడమే. ప్రస్తుతం చెన్నై మహానగరం తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. కనీసం తాగేందుకు కూడా చుక్కనీరు లేదు. దీంతో అనేక హోటల్స్, హాస్టల్స్, మ్యాన్షన్లు మూతపడున్నాయి. దీనికితోడు... అనేక ఐటీ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాల్సిందిగా కోరుతున్నారు. మరికొన్ని కంపెనీలు అయితే, ఏకంగా సెలవులు ప్రకటిస్తున్నాయి. ఇలా నీటి దుర్భిక్షంలో చెన్నై మహానగరం చిక్కుంది. ప్రస్తుతం చెన్నై నగరంలో ప్రభుత్వంతో పాటు.. ఇతర ప్రైవేటు వ్యక్తులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీరే ఆధారంగా మారింది. 
 
ఇంతటి దారుణ పరిస్థితిపై టైటానిక్ చిత్ర హీరో లియొనార్డో డికాప్రియో చలించిపోయారు. డికాప్రియా హాలీవుడ్ చిత్రాలతోనే కాకుండా మానవీయత ఉన్న పర్యావరణవేత్తగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. చెన్నై దుస్థితి పట్ల ఆయన తీవ్రంగా స్పందించారు. ఎండిపోయిన బావినుంచి పెద్దసంఖ్యలో ప్రజలు నీటిని తోడుకునేందుకు పోటీలుపడుతున్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై ప్రజల మంచినీటి కష్టాలకు వర్షాలు మాత్రమే పరిష్కారం చూపగలవని అభిప్రాయపడ్డారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా వర్షాలతో మాత్రమే చెన్నై ప్రజలకు ఊరట కలుగుతుందని, చెన్నై వాసులు కూడా వర్షాలు పడాలని కోరుకుంటున్నారని తన పోస్టులో వివరించారు. 
 
కాగా, నీరు లేక చెన్నై మహానగరంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడడం పట్ల డికాప్రియో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజలకు నీరు అందించేందుకు అధికారులు తీవ్రప్రయత్నాలు చేస్తున్నా ప్రయోజనంలేని పరిస్థితి ఉందని ఈ హాలీవుడ్ హీరో విచారం వ్యక్తం చేశారు.