గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 17 ఏప్రియల్ 2017 (10:44 IST)

దినకరన్‌కు డెడ్‌లైన్.. 18లోపు తప్పుకోవాలి.. లేదంటే బహిష్కరణే.. అత్త వద్దకు అల్లుడు పరుగులు

అన్నాడీఎంకేలో మళ్లీ అంతర్గత విభేదాలు ముదిరిపాకాన పడ్డాయి. పార్టీతో పాటు... తమ భవిష్యత్ కోసం వైరివర్గాలు చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల

అన్నాడీఎంకేలో మళ్లీ అంతర్గత విభేదాలు ముదిరిపాకాన పడ్డాయి. పార్టీతో పాటు... తమ భవిష్యత్ కోసం వైరివర్గాలు చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు కలిసి పని చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య జరుగుతున్న సామరస్యపూర్వక చర్చలు ఫలించే దిశగా సాగుతున్నాయి. మాతృపార్టీలో చేరేందుకు పన్నీర్ సెల్వం విధించిన షరతుకు ముఖ్యమంత్రి పళనిస్వామి తలొగ్గారు. 
 
పార్టీ నుంచి శశికళ కుటుంబ సభ్యులను పూర్తిగా దూరం పెట్టాలన్నది పన్నీర్ సెల్వం ప్రధాన డిమాండ్. దీనికి సీఎం సమ్మతించారు. ఈ విషయాన్ని తన మంత్రివర్గ సహచరుల ద్వారా టీటీవీ దినకరన్‌కు పంపించారు. ఈనెల 18వ తేదీలోపు పార్టీ నుంచి తప్పుకోవాలని, లేనిపక్షంలో బహిష్కరణ వేటు వేస్తామంటూ హెచ్చరికలు పంపారు. దీంతో దిక్కుతోచని టీటీవీ దినకరన్ సోమవారం హుటాహుటిన జైలులో ఉన్న తన అత్త శశికళను కలుసుకునేందుకు బెంగుళూరుకు పయనమయ్యారు. 
 
మరోవైపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకునేందుకు శశికళ భర్త నటరాజన్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అన్నాడీఎంకేలో 40 మంది ఎమ్మెల్యేలు శశికళ వర్గానికి వీర విధేయులు. గత ఎన్నికల్లో ఆశీర్వాదంతో వీళ్లంతా టికెట్లు పొందినవాళ్లే. అవసరమైతే కొంతమంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొనేందుకు సిద్ధమైంది శశి గ్రూప్. వీలైతే పళనిస్వామి సర్కార్‌ని పడగొట్టేలా దినకరన్ పావులు కదుపుతున్నట్లు తమిళ రాజకీయాల్లో హాట్‌న్యూస్. ఒకవేళ మంత్రులు తిరగబడితే స్వామి సర్కార్‌ ఉండదని అంటున్నారు. మొత్తానికి అన్నాడీఎంకే నుంచి మరోవర్గం చీలిక ఖాయమని అంటున్నారు.