గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 30 నవంబరు 2019 (10:35 IST)

నేడు 'మహా' బలపరీక్ష : ఎన్సీపీకి డిప్యూటీ - కాంగ్రెస్‌కు స్పీకర్

మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉద్ధవ్ ఠాక్రే శనివారం ఆ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా తన బలాన్ని నిరూపించుకోనున్నారు. శుక్రవారం అధికారికంగా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఉద్ధవ్... శనివారం మధ్యాహ్నం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు. ఈ విషయాన్ని విధానసభ అధికారులు తెలిపారు. గురువారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఉద్ధవ్ శుక్రవారం అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 
 
ఇదిలావుంటే, ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకుని స్పీకర్ పదవిని వదిలిపెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు వస్తున్న వార్తలపై ఎన్సీపీ నేత అజిత్ పవార్ స్పందించారు. ఎన్సీపీకి డిప్యూటీ సీఎం, కాంగ్రెస్‌కు స్పీకర్ పదవి ఇచ్చేందుకు మూడు పార్టీల మధ్య ఒప్పందం జరిగినట్టు తెలిపారు. స్పీకర్ పదవిని తాము తీసుకోబోమన్నారు. కాగా, స్పీకర్ పదవికి శనివారం ఎన్నిక జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
 
కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 105 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాత దానిమిత్రపక్షమైన శివసేన 56 సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగానూ, ఎన్సీపీకి 54 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు రాగా, మిగిలిన సీట్లను ఇతరులు కైవసం చేసుకున్నారు. మొత్తం 288 సీట్లున్న అసెంబ్లీలో సాధారణ మెజార్టీ 146 సీట్లు కావాల్సి వుంది. ఇపుడు శివసేనకు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు.. పది మంది స్వతంత్ర సభ్యులు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీంతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సర్కారు బలపరీక్షలు సులభంగా గట్టెక్కనుంది.