1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2020 (17:46 IST)

లాక్‌డౌన్ ఎత్తివేతపై కేంద్ర మంత్రి ఏమన్నారు.. కరోనా హాట్‌స్పాట్లలో పొడగింపు?

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా, ప్రస్తుతం లాక్‌డౌన్ అమలవుతోంది. మొత్తం 21 రోజుల పాటు అమల్లో ఉండే ఈ లాక్‌డౌన్ ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. ఈ గడువు తర్వాత లాక్‌డౌన్‌ను పొడగించవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. మరికొందరు మాత్రం లాక్‌డౌన్ ఎత్తివేస్తారని నమ్మకంగా చెబుతున్నారు. 
 
అయితే, సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ, గత 24 గంటల్లో 693 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపారు. అంటే, కోవిడ్-19 పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ ఎత్తివేతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
అంతేకాకుండా దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 4067 కాగా, వీటిలో మర్కజ్ మీట్‌తో లింకు ఉన్న కేసులు 1445 కేసులని లవ్ అగర్వాల్ వివరించారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ఎత్తివేత ఎంతవరకూ శ్రేయస్కరం అనే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. 
 
కేంద్ర కేబినెట్ సమావేశంలో కూడా లాక్‌డౌన్ ఎత్తివేత అంశం చర్చకొచ్చినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా 42 కరోనా హాట్‌స్పాట్‌లను కేంద్రం గుర్తించింది. లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14న ఎత్తివేసినా.. ఆ 42 చోట్ల మాత్రం కొనసాగించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా, కరోనా కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లో ఈ లాక్‌డౌన్ పొడగించే అవకాశం ఉన్నట్టు సమాచారం.