బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , గురువారం, 19 జనవరి 2017 (08:46 IST)

ప్రజల ఖాతాల్లో డబ్బు వేస్తాం. కానీ.. అది చెల్లించాల్సిన రుణమే

తిరిగి చెల్లించే రుణం రూపంలోనే సార్వత్రిక ప్రాథమిక ఆదాయం

ప్రజల ఖాతాల్లో  డబ్బులు బదిలీ చేయడానికి అభ్యంతరం లేదు కానీ అలా ఇచ్చిన డబ్బులను తిరిగి చెల్లించాల్సిన రుణం లాగే భావిస్తామని నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొన్ని విభాగాలు సార్వత్రిక ప్రాథమిక ఆదాయం (యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్) అనే భావనను విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అది ఉచితంగా ఇచ్చే డబ్బుగా ఉండదని అమితాబ్ వివరణ ఇచ్చారు. 
 
ప్రపంచంలో కొన్ని దేశాలు తమ ప్రజలు పనిచేసినా, చేయకున్నా జాతీయ సంపదలోంచి కొంత డబ్బును సార్వత్రిక ప్రాథమిక పథకం రూపంలో ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు రూపంలో బదిలీ చేయడం పట్ల సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా అధికారికంగా స్పందించనప్పటికీ ఈ కొత్త భావనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. 
 
స్విట్జర్లండ్ లోని దావోస్‌లో నాలుగవ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో మంగళవారం ఒక సెషన్‌లో  ప్రసంగించిన నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ఇలా ప్రజలకు డబ్బు ఇచ్చే పథకం మంచిదే కానీ ఇది ఉచితంగా ఉండరాదని సూచించారు. ఉత్పాదక ప్రయోజనాల కోసం ఇచ్చే రుణంగానే అలాంటి డబ్బు బదిలీని భావించాలని, దాన్ని తిరిగి చెల్లించవలసి ఉంటుందని స్పష్టం చేశారు. 
 
యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ స్వప్నమా లేక ప్రళయమా అని చర్చించిన ప్యానెల్‌లో కాంత్ భాగంగా ఉండి చర్చలో పాల్గొన్నారు. 
 
శ్రమ ప్రపంచంలో మౌలిక మార్పులనేవి సాంప్రదాయికమైన సామాజిక భద్రతా యంత్రాంగాలను ధ్వంసం చేసేశాయని, ఈ నేపథ్యంలోనే సార్వత్రిక ప్రాథమిక ఆదాయం అనేది చర్చల్లోకి వచ్చిందని కాంత్ తెలిపారు.
 
కాగా గత సంవత్సరం స్విట్జర్లండ్ ప్రజలు ఈ నూతన భావనకు చెందిన ప్రతిపాదనను తిరస్కరించిన విషయం తెలిసిందే.