శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 జులై 2020 (17:33 IST)

హెల్మెట్ ధరించలేదని నుదుటిపై తాళంచెవితో పొడిచారు..

Key
హెల్మెట్ ధరించలేదని పోలీసులు ఓవరాక్షన్ చేశారు. హెల్మెట్‌ లేకుండా ద్విచక్రవాహనం నడుపుతున్న యువకుడి నుదుటిపై తాళంచెవితో పొడిచారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లోని రుద్రాపుర్‌ పట్టణంలో చోటుచేసుకుంది. ఆగ్రహం వ్యక్తంచేసిన స్థానికులు పోలీసు స్టేషన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిపై లాఠీ ఛార్జీకి తెగబడ్డారు. ఈ ఘటనపై మండిపడ్డ జిల్లా పోలీసు శాఖ ఓ ఎస్సై, ఇద్దరు పోలీసులను సస్పెండ్‌ చేసినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు.  
 
వివరాల్లోకి వెళితే.. రామ్‌పురా గ్రామ నివాసి దీపక్‌ (20) మిత్రుడితో కలిసి ద్విచక్రవాహనంలో పెట్రోల్‌ పోయించుకునేందుకు స్థానిక పెట్రోల్‌ బంక్‌కు వెళుతున్నాడు. ఆ సమయంలో అక్కడ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు వారి వాహనాన్ని ఆపారు. అయితే వారు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన ఓ పోలీసు వారి బైక్‌ తాళంచెవిని లాక్కొని దీపక్‌ నుదిటిపై బలంగా గుచ్చాడు. 
 
కాగా నుదుటిపై తాళం చెవితోనే గ్రామానికి వెళ్లిన బాధితుడు జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులు, గ్రామస్థులకు వివరించాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులుస్థానిక పోలీసు స్టేషన్‌కు చేరుకొని ఈ దారుణానికి పాల్పడ్డ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసు స్టేషన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నిస్తుండగా వారిపై పోలీసులు లాఠీఛార్జి చేశారు.
 
సమాచారం అందుకున్న స్థానిక శాసనసభ్యుడు రాజ్‌కుమార్ తుక్రాల్ పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఈ సంఘటపై అధికారులకు ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే స్థానికులను సముదాయించారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.