గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 11 ఆగస్టు 2017 (11:21 IST)

ఉపరాష్ట్రపతిగా వెంకయ్య ప్రమాణస్వీకారం... 'మాట్లాడాలా?' అని అడిగితే.. వద్దనడంతో సీట్లోకి!

దేశంలో రెండో అత్యున్నత పదవి అయిన ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. శుక్రవారం పార్లమెంట్‌ ప్రాంగణంలోని దర్బార్ హాల్‌లో జ

దేశంలో రెండో అత్యున్నత పదవి అయిన ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. శుక్రవారం పార్లమెంట్‌ ప్రాంగణంలోని దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో వెంకయ్య ప్రమాణ స్వీకారం చేశారు. 
 
ఈసందర్భంగా హిందీలో వెంకయ్య ప్రమాణస్వీకారం చేయడం గమనార్హం. వెంకయ్య ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ, బీజేపీ కురువృద్ధుడు అద్వానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, వివిధ పార్టీల అధినేతలు హాజరయ్యారు.   
 
ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆసక్తికర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ప్రమాణ స్వీకారం తర్వాత వెంకయ్యనాయుడు మైకు ముందుకు వచ్చి, తాను ప్రసంగించాలా? అని అక్కడున్న అధికారులను అడగడంతో, వారు అక్కర్లేదని చెప్పడంతో, తనకు కేటాయించిన సీట్లో కూర్చునేందుకు ఆయన వెళ్లిపోయారు. 
 
ఓ తలపండిన రాజకీయ నాయకుడిగా వెంకయ్య, నిత్యమూ రాజకీయ ప్రసంగాలు చేసేందుకు అలవాటు పడిపోయిన సంగతి తెలిసిందే. అందువల్లే ప్రమాణం తర్వాత బాధ్యతలు తీసుకుంటున్నట్టు సంతకం పెట్టిన తర్వాత, కాసేపు మాట్లాడేందుకు ఆయన ముందుకు వచ్చారు. అయితే, ప్రొటోకాల్ ప్రకారం ప్రమాణ స్వీకారాల తర్వాత రాష్ట్రపతి ఆశీనులై ఉండగా, ప్రసంగాలకు అవకాశం లేదు. ఆపై జాతీయ గీతంతో ఈ కార్యక్రమం ముగిసింది.