శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 నవంబరు 2015 (13:12 IST)

అసహనం ఘటనలు చిన్న విషయాలేమీ కాదు : సీపీఎం ఎంపీ సలీం

అసహనం అంశంపై సోమవారం లోక్‌సభ దద్ధరిల్లిపోయింది. ఈ అంశంపై స్పీకర్ సుమిత్రా మహాజన్ సభలో 193 నిబంధన కింద చర్చకు అనుమతిచ్చారు. దీంతో సీపీఎం సభ్యుడు మహమ్మద్ సలీం మాట్లాడుతూ అసహనం ఘటనలు చిన్న విషయాలేమీ కావన్నారు. ప్రజాస్వామ్యం అంటేనే చర్చలకు వేదిక అని గుర్తు చేశారు. 
 
మేధావులు తమ పురస్కారాలను వెనక్కి ఇచ్చేస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు జరగలేదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి. నిరంతరం మారే ప్రభుత్వాలు ప్రామాణికం కాదు. దేశం మాత్రం హేతుబద్ధంగా ఉండాలి. బహుళత్వం ప్రాతిపదికగా సాగాలి. వెనుకబడిన, దిగువ తరగతి, నిర్లక్ష్యానికి గురైన ప్రజలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలని రాజ్యాంగం చెబుతుందని గుర్తు చేశారు. 
 
మీరు చెప్పే ప్రతి విషయాన్ని ప్రపంచం వింటోంది. అలాగే, ప్రపంచం చెప్పేదాన్ని కూడా మీరు చెప్పాలని కోరారు. అంతేకాకుండా తప్పు చేసినవాడు, తప్పును చూస్తూ ఉండిపోయిన వాడు ఇద్దరూ సమానమేనని ఠాగూర్ చెప్పారని ఎంపీ సలీం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 
 
పైగా, దేశంలో అసహనం ఓ సీరియస్ సమస్యగా మారిందని సీపీఎం ఎంపీ మోహ్మద్ సలీమ్ ఆరోపించారు. తాము చేస్తున్న నిరసనలను ప్రభుత్వం తప్పుగా చిత్రీకరిస్తుందని ఆయన ఆరోపించారు. గత 800 ఏళ్లలో తొలిసారి ఓ హిందూ ప్రభుత్వం ఏర్పడిందని రాజ్‌నాథ్ ఓ నివేదికలో అన్నట్లు సలీమ్ సభలో తెలిపారు. 
 
అయితే సలీమ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు తాను చేయలేదన్నట్లు హోంమంత్రి అన్నారు. సలీమ్ క్షమాపణలు చేప్పాలని మంత్రి కోరారు. సలీమ్ వ్యాఖ్యలు ఎంతో బాధపెట్టాయని, ఇన్నాళ్ల రాజకీయ జీవితంలో తాను ఎన్నడూ ఇంతగా బాధపడలేదని రాజ్‌నాథ్ భావోద్వేగంగా అన్నారు. అసహనంపై ప్రతిపక్షాల సలహాలు స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్ అన్నారు.