శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 2 ఆగస్టు 2015 (15:49 IST)

భారీ వర్షాలతో ఉత్తర, తూర్పు, ఈశాన్య భారతం అతలాకుతలం : 61 మంది మృతి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తుఫాను తోడుకావడంతో వెస్ట్ బెంగాల్‌తో పాటు ఒడిషా, హిమాచల్‌ప్రదేశ్‌, మణిపూర్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా భారీ వరదలు సంభవించాయి. హిమాచల్, మణిపూర్ రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రాణ నష్టం వాటిల్లింది.
 
ఒక్క మణిపూర్‌ రాష్ట్రంలోని చందేల్‌ జిల్లా జైమూల్‌ గ్రామంలో కొండచరియలు విరిగిపడి 21 మంది మృతి చెందారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రాలో కొండచరియలు విరిగిపడడంతో ఇళ్లు కూలిపోయాయి. నిలువ నీడ లేక జనం రోడ్డున పడ్డారు. పరిస్థితిని అంచనా వేసి సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు జాతీయ రహదారులు మూసుకుపోవడంతో రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది.
 
మరోవైపు... వెస్ట్ బెంగాల్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు ఖాయమని వాతావరణశాఖ ప్రకటించడంతో జనం భయాందోళనకు లోనవుతున్నారు. ఈ రాష్ట్రంలో 12 జిల్లాల్లో లక్షలాది మంది వరద బాధితులుగా మారారు. వీరి కోసం 966 సహాయక శిబిరాలను ఏర్పాటుచేసింది.
 
బెంగాల్ రాష్ట్రంలో ఇప్పటివరకు కురిసిన భారీ వర్షాలకు 40 మంది వరకు చనిపోయినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. అలాగే, హౌరా, హుబ్లీ, బంకూర, దక్షిణ 24 పరగణాలు, తూర్పు మిడ్నాపూర్‌ జిల్లాల్లో భారీగా పంట నష్టం సంభవించింది. మిడ్నాపూర్‌ జిల్లాలో 60వ నెంబర్‌ జాతీయ రహదారి అక్కడక్కడ కోట్టుకుపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.