వీకెండ్ స్పెషల్ : వెరైటీ మసాలా చేపలు పులుసు
అసలే ఎండలు.. చికెన్ వద్దు బాబోయ్ అనుకుంటున్నారా? అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చేపల్ని ఎంచుకోండి. చేపల్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలున్నాయి. వీటిని రోస్ట్లా కాకుండా పులుసుతో వీకెండ్ లంచ్ చేయండి.
వెరైటీ చేపలు పులుసుకు కావలసిన పదార్థాలు:
చేపలు - అరకేజీ
చింతపండు - కొద్దిగా
పచ్చిమిర్చి తరుగు- రెండు టీ స్పూన్లు
ఉల్లి తరుగు - పావు కప్పు
కారం - ఒక టేబుల్ స్పూన్
ఉప్పు, నూనె - తగినంత
యాలకులు, లవంగం, దాల్చిన చెక్క- ఒక స్పూన్
వెల్లుల్లి, అల్లం పేస్ట్ - ఒక టీ స్పూన్
కొత్తిమీర తరుగు- పావు కప్పు
ధనియాల పొడి - ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి - ఒక టేబుల్ స్పూన్
గసగసాల పొడి - ఒక టేబుల్ స్పూన్
తయారీ విధానం :
ముందుగా గ్రేవీ బౌల్ తీసుకుని అందులో శుభ్రం చేసిన చేపముక్కలు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి, కారం, ధనియాలపొడి, ఉల్లి తరుగు, జీలకర్ర వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టాలి. తర్వాత మరో పాన్లో నూనె పోసి వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగం, యాలకుల పేస్ట్ను వేసుకోవాలి. ఇందులోనే చేపల ముక్కల మిశ్రమాన్ని కలపాలి.
మంటను బాగా తగ్గించి చేప ముక్కల్ని కాసేపు ఉడికించాలి. ఉడికే ముందుగానే కొద్దిగా ఉప్పు కూడా చేర్చి పెట్టుకోవాలి. ఈ గ్రేవీ మరి చిక్కగా కాకుండా మీడియంగా ఉండేట్లు చూసుకోవాలి. చేపలు ఉడికిన తర్వాత కరివేపాకు, చింతపులుసు పోసి ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే ఫిష్ కర్రీ రెడీ.