గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 14 సెప్టెంబరు 2016 (16:47 IST)

అమెరికాలో ఘనంగా గణనాథుని ఉత్సవాలు( అమెరికా తెలంగాణ అసోసియేషన్ ఫోటోలు)

డెట్రాయిట్ - సెప్టెంబర్ 11: లక్ష పుష్పాలు, వెయ్యికి పైగా భక్త జనసందోహం, ఏడు రోజుల వరుస కార్యక్రమాలు, మూడు వందల మందికి పైగా దాండియా నృత్యాలు, నాలుగు వందల వరకు ఉచిత సంప్రదాయ దుస్తుల పంపిణీ(కుర్తాలు), వందల మంది అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలు, వందలకొద్

డెట్రాయిట్ - సెప్టెంబర్ 11: లక్ష పుష్పాలు, వెయ్యికి పైగా భక్త జనసందోహం, ఏడు రోజుల వరుస కార్యక్రమాలు, మూడు వందల మందికి పైగా దాండియా నృత్యాలు, నాలుగు వందల వరకు ఉచిత సంప్రదాయ దుస్తుల పంపిణీ(కుర్తాలు), వందల మంది అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలు, వందలకొద్దీ రంగులు, 25 మంది సంప్రదాయ వాయిద్యకారులు, ఉచిత సంప్రదాయ భోజనాలు, నాటకాలు, భజనలు, శాస్త్రీయ సంగీత నృత్యాలు అన్ని కలిస్తే, గణనాథుడు అమెరికా మహానగరంలో ప్రవాస భారతీయులు, అమెరికన్ల నడుమ వైభవంగా నగర కూడళ్ళ మధ్యన ఊరేగి భారతీయ పండుగల ప్రాశస్త్యాన్ని, వైభవాన్ని అమెరికాలో చాటి చెప్పాడు.
 
అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏడు రోజుల పాటు జరిగిన గణేశుని ఉత్సవాలు భారదేశాన్ని అమెరికాకి మోసుకొచ్చినట్టు వైభవోపేతంగా, కన్నుల పండుగగా జరిగాయి. దీని కోసమని ప్రత్యేకంగా మహా గణపతి విగ్రహం ఇండియా నుండి తెప్పించారు. ఏడు రోజుల పాటు ఇండియాలో జరిగినట్టుగానే గణేశుని సమక్షంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలని నిర్వహించారు. భక్తి గీతాలు, శాస్త్రీయ సంగీతం, భజన కార్యక్రమం, పౌరాణిక నాటకాలు (ఇంగ్లీషులో), పిల్లలతో అభిషేకం, చవితి ప్రవచనం, వినాయక చరిత్ర ప్రవచనం, కుంకుమార్చన, దాండియా, లక్ష పుష్పార్చన, లడ్డూ వేలం, కలర్ ఫెస్టివల్, తెలంగాణ, మరాఠా మరియు మళయాళ వాయిద్యాల హోరులో వీధుల్లో ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరగడం స్థానిక ప్రవాస భారతీయులని ఆనందంలో ముంచెత్తింది. 
 
అంగరంగ వైభవంగా అలంకరించ బడిన సిద్ది వినాయక రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమకు తాముగా పిల్లలు, అమెరికన్లు వేడుకల్లో పాలు పంచుకోవడం కనిపించింది. రక్షణ కార్యక్రమాలు చూసిన అమెరికన్ పోలీస్ ఆఫీసర్లు కూడా వేడుకల్లో కాసేపు పాలు పంచుకున్నారు. పిల్లలు వివిధ దేవుళ్ళ వేషాలు వేసుకుని వచ్చి గణేశుని వేడుకలకు మరింత వన్నె తెచ్చారు. తెలుగు, మరాఠీ, గుజరాతీ, మలయాళీ, తమిళ, కన్నడ, హిందీ రాష్ట్రాల ప్రజలందరూ ఒక్క చోటికి వచ్చి ఊరేగింపులో పాల్గొన్నారు. వివిధ భాషల ప్రజలు వాడే గణపతి నినాదాలు వినిపించడం కొత్త అనుభూతిని నింపింది. వాతావరణం అనుకూలించక పలుమార్లు వర్షం పడినా ఒక్కరు కూడా ఊరేగింపుని వదలి వెళ్ళలేదు.
 
దాదాపు నాలుగు వందల వరకు కుర్తాలు ఉచితంగా పంచిపెట్టారు. లక్షపుష్పార్చనలో పాల్గొన్న వారందరికీ సంప్రదాయ భోజన ప్రసాదం ఏర్పాటు చేశారు. డీజే పాటల వంటివి పెట్టకుండా కేవలం సంప్రదాయ వాయిద్యాలతోనే ఊరేగింపు కొనసాగడం గమనార్హం. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ గణనాథుని ఉత్సవాల్లో భాగస్వాములు అయ్యారు.
 
ఆంధ్రా మిత్రులొకరు “తెలంగాణా వాళ్ళా మజాకా” అనడం ఉత్సవ కార్యవర్గ సభ్యులని సంతోష పరిచింది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఒకటి ఉన్నది. అమెరికన్ తెలంగాణ సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగినా కూడా జాతి, ప్రాంత, వర్గ, వర్ణ, వయ: వ్యత్యాసం లేకుండా అందరిని భాగస్వాములని చేసిన తెలంగాణ వారి సాంస్కృతిక సమరుజ్జీవన భావం అణువణువునా కనిపించింది. సంఘం పేరుతొ ఒక చిన్న బానర్ తప్పితే ఎక్కడా కూడా మాది, మేము అనే తత్త్వం కనిపించలేదు. అంతటా మనం, మనది, మన గణేశుడనే భక్తి తాత్పరత, కలుపుగోలుతనం, ఆప్యాయత కనిపించడం తెలంగాణేతర ప్రజలని ముగ్ధుల్ని చేసింది.
 
శ్రీధర్ ఐత, వాసు గంప, వెంకట్ అడపలు ముందుండి కార్యక్రమ నిర్వహణ పనులని నడిపించారు. ఆటా తెలంగాణ కన్వెన్షన్ కన్వీనర్ శ్రీ వినోద్ కుకునూర్, శ్రీ నాగేందర్ ఆయిత గార్లు మొదటి నుండి అందించిన సహాయ సహకారాల వల్లనే ఇదంతా సాధ్యమయిందని నిర్వాహక సభ్యులు తెలియ చేసారు. రమేష్ భోగి, ఉదయ్ మణి, పవన్, కృష్ణ చైతన్య అల్లం, సాయి కృష్ణ, వెంకట్ బొల్లవరం, కృష్ణ చైతన్య సిద్ధగొని మరెందరో సభ్యులు, వాలంటీర్లు ఒక్కో పనీ భుజాల మీద మోసుకుని రెండు నెలలుగా ప్రణాళిక వేసుకుని ఎన్నో వ్యయ ప్రయాసలని దాటుకుని మొత్తానికి విజయవంతంగా జరపగాలిగాం అని శ్రీధర్ ఐత, వాసు గంపలు తెలియ చేసారు. 
 
రాజీ లేని సహాయ సహకారాలు అందించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వారికి, అడగ్గానే మేమున్నాం అని ముందుకొచ్చి సాయం చేసిన ప్రతీ దాతకు, మాధ్యమం అందించిన అమెరికా తెలంగాణా సంఘం, మరియు ప్రెసిడెంట్ రాం మోహన్ కొండ గారికి, స్థానిక ప్రవాస భారతీయులందరికీ పేరు పేరునా డెట్రాయిట్ గణేష్ ఉత్సవ్ కమిటీ ధన్యవాదాలు తెలియ చేసింది. - కృష్ణ చైతన్య అల్లం (ఆటా తెలంగాణ మీడియా ప్రతినిధి, డెట్రాయిట్).