బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By
Last Updated : శనివారం, 30 మార్చి 2019 (15:08 IST)

భీమవరంలో ఇల్లాలు... అమెరికాలో ప్రియురాళ్లు... వీసా నాటకాలు...

ఎన్నారై సంబంధాలు కొన్ని బెడిసికొడుతున్నాయి. కొంతమంది యువకులు తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు ఇక్కడి అమ్మాయిలను పెళ్లి చేసుకుని వారిని పుట్టింటికే పరిమితం చేసి అమెరికాలో ఆఫ్షన్స్ వెతుక్కుంటున్నారు. తాజాగా మరో ఎన్నారై బాగోతం బయటపడింది. పెళ్లి చేసుకున్న భార్యను ఇక్కడే వదిలేసి వీసా వచ్చాక తీసుకెళ్తానని మాయమాటలు చెప్పి అమెరికాలో వేరే అమ్మాయిలతో కులుకుతున్నాడు.
 
వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా పెనమలూరులోని యనమలకుదురుకు చెందిన సంధ్యారాణికి, అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ప.గో జిల్లా భీమవరానికి చెందిన ధనరాజ్‌తో 2017లో పెళ్లయ్యింది. ఈ సమయంలో వధువు తల్లిదండ్రులు వరుడికి భారీగా కట్నకానుకలు ముట్టచెప్పారు. పెళ్లయ్యాక తమ కుమార్తె ఎంచక్కా అమెరికా వెళ్తుందని పుట్టింటివారు అనుకున్నారు. అలాగే అమ్మాయిని విజయవాడలోని అత్తారింటికి తీసుకువచ్చారు. 
 
ఈ క్రమంలో ధనరాజ్ తనకు శెలవులు లేవని అమెరికా వెళ్లిపోయాడు. ఆ తర్వాత వీసా వచ్చాక నిన్ను తీసుకెళ్తానంటూ భార్య సంధ్యారాణికి చెప్తూ వచ్చాడు. ఐతే వీసా సంగతి అలావుంటే విజయవాడలో అత్తమామల నుంచి అదనపు కట్నం వేధింపులు ప్రారంభమయ్యాయి. కట్నంగా ఇచ్చిన స్థలాన్ని అమ్మి డబ్బు తీసుకురావాలంటూ అత్తమామలు వేధింపులు మొదలుపెట్టారు. 
 
మరోవైపు భర్త నుంచి ఎలాంటి పిలుపు లేదు. వీసా వచ్చాక తీసుకెళ్తానన్న భర్త జాడ లేదు. అత్తారింటి ఆరళ్లు తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిపోయింది సంధ్యారాణి. అసలు తన భర్త అమెరికాలో ఎలా వున్నాడో తెలుసుకునేందుకు తన స్నేహితుల సాయం కోరింది. అమెరికాలో ధనరాజ్ మరో ఇద్దరు యువతులతో సహజీవనం చేస్తున్నట్లు తెలుసుకున్న సంధ్యారాణి స్నేహితులు ఆ విషయాన్ని ఆమెతో చెప్పారు. దీనితో షాక్ తిన్న సంధ్య, తన భర్త- అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.