శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 25 సెప్టెంబరు 2017 (19:43 IST)

తెలంగాణ NRI ఫోరమ్ ఆధ్వర్యంలో లండన్‌లో బతుకమ్మ జాతర

తెలంగాణలో జరుగుతున్న మహా బతుకమ్మ వేడుకలకు మద్దతుగా తెలంగాణా ఎన్నారై ఫోరం ఇంగ్లాండులో ప్రవాస తెలుగు వారికోసం జాతర లాంటి వాతావరణాన్ని హౌన్‌స్లా లోని ఇండియన్ జిమ్ఖానా గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసింది. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి సుమారు 2000 మందికి పైగా త

తెలంగాణలో జరుగుతున్న మహా బతుకమ్మ వేడుకలకు మద్దతుగా తెలంగాణా ఎన్నారై ఫోరం ఇంగ్లాండులో ప్రవాస తెలుగు వారికోసం జాతర లాంటి వాతావరణాన్ని హౌన్‌స్లా లోని ఇండియన్ జిమ్ఖానా గ్రౌండ్స్‌లో  ఏర్పాటు చేసింది. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి సుమారు 2000 మందికి పైగా తెలంగాణా కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
 
తెలుగు ఆడపడచులంతా సంప్రదాయ వస్త్రాలు ధరించి తాము తయారుచేసిన బతుకమ్మలను చేత బట్టుకుని TeNF ఏర్పాటు చేసిన గ్రామీణ పండుగ వసతులతో నిండిన ఇండియన్ జిమ్ఖానా గ్రౌండ్స్‌కి చేరుకొని, ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని ఆ తర్వాత రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను మధ్యలో వుంచి వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ, "బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో! బంగారు బతుకమ్మ ఉయ్యాలో!!" అని గొంతెత్తి పాడుతూ తెలంగాణ పూల పండుగైన బతుకమ్మ పండుగను ఎంతో సాంప్రదాయబద్దంగా తెలంగాణా గ్రామీణ వాతావరణాన్ని గుర్తుకు తెచ్చేలా వేడుకలను జరుపుకోవటం అందరిని ఆకట్టుకుంది. చిన్నారులు సైతం చిన్న చిన్న బతుకమ్మలతో వేడుకలకు కొత్త అందాన్ని తెచ్చారు. మగవారు కట్టే కోలాటంతో గ్రామీణ పల్లె గీతాలకు లయబద్దంగా నర్తించారు. అనంతరం బతుకమ్మలని నిమజ్జనం చేసి, మలిదా ప్రసాదాన్ని పంచుకున్నారు. తెలంగాణా నుంచి తెప్పించిన "జమ్మి చెట్టు"కు ప్రత్యేక పూజలు చేసి జమ్మిని ఇచ్చిపుచ్చుకున్నారు.  
 
చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన రంగుల రాట్నం, కప్ రైడ్స్, బౌన్సీ కాసిల్, మహిళల కోసం ఏర్పాటు చేసిన నగలు, వస్త్ర ప్రదర్శనలు, తినుబండారాల దుకాణాలు, విద్యుత్ దీప కాంతుల వెలుగుజిలుగులు తెలంగాణా జాతరను తలపించిందని స్వదేశంలోని గ్రామాలలో బతుకమ్మ జరుపుకున్నట్టుగా ఉందని దానికోసం తెలంగాణా ఎన్నారై ఫోరం చేసిన ప్రయత్నాన్ని అందరూ ఎంతగానో అభినందించారు. 
 
స్వదేశం నుంచి తమ పిల్లలు, మనుమలతో సమయం గడిపేందుకు వచ్చిన పెద్దలు, హాజరైన అతిధులు, TeNF సంస్థ చేస్తున్న సాంస్కృతిక సంబరాలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని, విదేశీ గడ్డపై ఇంత ఘనంగా భారతీయ సంస్కృతిని, ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్ర సంస్కృతిని ప్రపంచానికి చాటుతున్న తీరు ఎంతో గొప్పగా ఉందని ప్రశంసించారు. 
 
తెలంగాణా నుంచి ఈ మహా బతుకమ్మ వేడుకలలో ముఖ్య అతిథులుగా పాల్గొనటానికి వచ్చిన కొండా సురేఖ (TRS MLA), కొండా మురళి, T. ప్రకాష్ గౌడ్ (TRS MLC), గుండవరపు దేవీప్రసాద్(తెలంగాణ రాష్ట్ర బివరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌), నాగేందర్ గౌడ్ (తెలంగాణ ఎడ్యుకేషన్ మరియు వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్), తెలుగు సినీ  దర్శకులు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ బాధ్యత గల తెలంగాణా బిడ్డలుగా, నాటి ఉద్యమం నుండి నేటి పునర్నిర్మాణం వరకు అన్నింట్లో ముందున్న ఎన్నారై ఫోరమ్, తెలంగాణా అస్థిత్వాన్ని మరియు సంప్రదాయాలను ముందుతరాలకు తెలియజేసేందుకు చేస్తున్న కృషిని ప్రశంసించారు. 
 
అతిధులుగా వచ్చిన స్థానిక మహిళా ఎంపీలు, ప్రవాస తెలంగాణ బిడ్డలతో కలిసి కోలాటం ఆడి సందడి చేసి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి TeNF,"చేనేతకు చేయూతనిద్దాం నేతన్నకు మద్దతునిద్దాం" అనే నినాదంతో తాము నిర్వహించిన అన్ని కార్యక్రమాలలో చేనేత వస్త్రాల ప్రత్యేక స్టాల్‌ని ఏర్పాటు చేసి హాజరైన ఎన్నారైలకు మరియు అతిథులకు రాష్ట్రంలో, నేతన్నకు భరోసా కల్పించడానికి తమవంతు సాయంగా చేస్తున్న ప్రచార కార్యక్రమాలని వివరిస్తున్న తీరు ప్రశంసనీయం అని తెలంగాణా నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు కొనియాడారు. 
 
బ్రిటన్ లోని పలువురు ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా మరియు ఇతర ప్రవాస భారత సంఘాల ప్రతినిధులు, వేడుకలలో పాల్గొన్న వారిలో ఉన్నారు. ఉత్తమ బతుకమ్మలకు ప్రధమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతులు అందజేశారు. అలాగే రాఫెల్ లక్కీ డ్రాలో గెలిచినవారికి కూడా ప్రత్యేక బహుమతులు అందించారు. అనంతరం హాజరైన వారికి పసందైయిన హైదరాబాదీ వెజ్ బిరియానీని వడ్డించారు. తెలంగాణ కుటుంబాలు ఇలా ఒకేచోట కలుసుకొని పండగ జరుపుకోవడం చాల సంతోషంగా ఉందని ఈ జాతరలో పాల్గొన్న వారందరూ అభిప్రాయపడ్డారు. 
 
కార్యక్రమంలో వ్యవస్థాపక చైర్మన్ గంప వేణుగోపాల్, అద్యక్షులు సిక్క చంద్రశేఖర్ గౌడ్, అడ్వైజరీ ఛైర్మన్ అంతటి ప్రమోద్, ఉపాధ్యక్షులు ప్రవీణ్ గంగసాని, తిరుపతి గోలి, ముఖ్య కార్యదర్శిలు నగేష్ రెడ్డి కాసర్ల, కోశాధికారులు వెంకట్ రంగు, నరేష్ మరియాల, సాంస్కృతిక కార్యక్రమాల కార్యదర్శి స్వామి ఆశ, స్పాన్సర్ టీం అశోక్ మేడిశెట్టి, భాస్కర్ మొట్ట, రాజేష్ ఎనపోతుల, మీడియా టీం - సాయి ప్రసాద్ మార్గం, శిరీష కే చౌదరి, సాంస్కృతిక కార్యక్రమాల కార్యదర్శి స్వామి ఆశ, స్వచ్చంద మరియు సంక్షేమ టీం-మీనాక్షి అంతటి, తెలంగాణ ఎన్నారై ఫోరం మహిళా విభాగం సభ్యులు - హేమలత గంగసాని, జయశ్రీ గంప, జ్యోతిరెడ్డి కాసర్ల, కవిత గోలి, కావ్యా రెడ్డి, మేఘల ఆకుల, ప్రీతీ సీక, ప్రియాంక కర్పూరం, రమాదేవి తిరునగరి, శ్రీలక్ష్మి మర్యాల, సుచరిత కాల్వ, వాణి రంగు, నందిని మొట్ట, భారతి కొప్పుల, రజిత, వాణి రంగు, ఏరియా ఇంచార్జిలు, వెస్ట్ & నార్త్ ఈవెంట్ కో-ఆర్డినేటర్స్, సతీష్ వాసిరెడ్డి , ఈస్ట్ & నార్త్ ఈవెంట్ కోఆర్డినేటర్స్ - శ్రీధర్ నల్ల, వీరు చౌదరి, రమేష్ సింగం గౌడ్, శేషు కుమార్ ఆళ్ళ, సతీష్ వాసిరెడ్డి, ఈస్ట్ & నార్త్ ఈవెంట్ కోఆర్డినేటర్స్ - శ్రీధర్ బాబు మంగళారపు, సంతోష్ కోడిప్యాక వేడుకలలో పాల్గొన్న వారిలో వున్నారు.