ఆధునిక ప్రేమకు పునాదులుగా ఫేస్బుక్ - ట్విట్టర్ - వాట్సాప్.. కానీ..?!
ముందంతా ప్రేమకానీ, పెళ్ళి అనేది కానీ గుళ్లుగోపురాలు, బంధువుల ఇళ్ళల్లో మొదలవుతాయి. అయితే పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం జోడీ కోసం కుర్రకారులు వెతికేది 99 శాతం ఆన్లైన్లోనే అన్నది వాస్తవం. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్... ఇవన్నీ ప్రస్తుతం ప్రేమకి పునాదిలే. భవిష్యత్తులో వీటి స్థానంలో డేటింగ్ యాప్స్ వచ్చి చేరతాయనడంలో అతిశయోక్తి లేదు.
మొహమాటాలు, ముసుగులు వదిలేసిన నేటి యువత స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండటానికి తమలాంటి వ్యక్తిత్వాలు, భావాలు ఉన్న యువతతో అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ యాప్స్ని వేదికగా మలుచుకుంటున్నారు. 2015 లెక్కల ప్రకారం దేశంలో దాదాపు రెండుకోట్ల మంది ఈ యాప్స్ని తమ స్మార్ట్ఫోన్లలో నిక్షిప్తం చేసుకున్నారు. ఇందులో అమ్మాయిల వాటా 43 శాతం. ఆర్నెళ్లలో ఈ సంఖ్య రెట్టింపవుతుందని అంచనా వేయబడుతుంది.
ఒకేరకమైన భావాలు, వ్యక్తిత్వం, అభిప్రాయాలు ఉన్నవాళ్లని ఒక్కచోటికి చేరుస్తాం అన్నది యాప్స్ చెప్పేమాట. నిజంగానే ఇవి రెండు మనసుల మధ్య వారధిగా పని చేస్తున్నాయా? అంటే 'ఇద్దరు అపరిచితుల మధ్య పరిచయం పెంచడానికి ఉపయోగపడొచ్చుగానీ, రెండు మనసుల్ని కచ్చితంగా కలపలేవు. కానీ తమలోని భావోద్వేగాలు పంచుకోవడానికి పనికొస్తాయి' అంటున్నారు నిపుణులు.