మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 17 సెప్టెంబరు 2018 (09:36 IST)

అఖిలాండ నాయకుని గరుడోత్సవం..

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. కీలకమైన గరుడసేవ సోమవారం జరుగనుంది. గరుడసేవ రోజున, తనకెంతో ప్రీతిపాత్రమైన గరుత్మంతుడిపై ఆసీనుడయ్యే వెంకన్న, తిరుమాడవీధుల్లో విహరిస్తాడు. ఆ సమయంలో ఆ దేవ

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. కీలకమైన గరుడసేవ సోమవారం జరుగనుంది. గరుడసేవ రోజున, తనకెంతో ప్రీతిపాత్రమైన గరుత్మంతుడిపై ఆసీనుడయ్యే వెంకన్న, తిరుమాడవీధుల్లో విహరిస్తాడు. ఆ సమయంలో ఆ దేవదేవుని చూసి తరించాలని, ఎంతో ప్రయాసతో వచ్చిన లక్షలాది మంది భక్తులతో ప్రస్తుతం తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. 
 
సోమవారం (సెప్టెంబర్ 17)న ఈ గరుడోత్సవం జరుగనుంది. బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన సోమవారం దంతపు పల్లికిలో మోహినీ వేషధారణలో స్వామి కనువిందు చేయనున్నారు. అది ముగియగానే, మాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి ఉదయం 11 గంటల నుంచి గరుడోత్సవాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులను అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది.
 
బంగారు గరుడ వాహనంపై స్వామివారు విశేష ఆభరణాలతో అలంకృతుడై, గజమాలలు, శ్రీవల్లి పుత్తూరు గోదాదేవి ఆలయం నుంచి వచ్చిన మాలలను స్వామివారు ధరించి భక్తులను దర్శనమివ్వనున్నాడు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు ఇప్పటికే భారీ ఎత్తున భక్తులు తిరుమలకు తరలివచ్చారు. గరుడోత్సవం సందర్భంగా గర్భాలయంలో మూలవరులకు సదా సమర్పణలో ఉండే చతుర్భుజ లక్ష్మీహారం, ఐదు పేటల సహస్రనామం, మకరకంఠి అనే పేరిట ఉండే ప్రాచీన మూడుపేటల తిరువాభరణం తదితరాలతో అలంకరిస్తారు.
 
గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శించుకోవడం ద్వారా సర్పదోష శాంతి, దివ్యమైన జ్ఞానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. సమస్త వాహనాలలో సర్వశ్రేష్ఠమైన గరుడవాహనంపై ఉన్న స్వామిని దర్శిస్తే, స్వర్గప్రాప్తి కలుగుతుందని, ఇహపరమైన ఈతిబాధల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. 
 
గరుడవాహన సేవ రోజున తిరుమలలో ఆకాశంలో గరుడపక్షుల సంచారం మరో అద్భుతమని తితిదే అధికారులు చెప్తున్నారు. గరుడసేవ జరిగే సమయానికి ఆకాశంలో గద్దలు తిరుగుతూ కనిపిస్తాయి. మిగతా ఏ సేవ రోజూ కూడా ఈ పక్షులు కనిపించవు. అందుకే గరుడోత్సవానికి అంతటి ఘనమైన ప్రాధాన్యముందని తితిదే అధికారులు తెలిపారు.